చంద్రబాబు జీవితమంతా దిగజారుడే, రాజీనామా లీకులేలా?: వైవీ నిప్పులు
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు జీవితమంతా ఎమ్మెల్యేలను కొనడం,
హైదరాబాద్: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు జీవితమంతా ఎమ్మెల్యేలను కొనడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు.
హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు దిగజారుడుతనాన్ని రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరి మంత్రివర్గ విస్తరణలో పదవులు పొందిన భూమా అఖిలప్రియ, అమర్నాథ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజయకృష్ణ రంగారావు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారంటూ లీకులివ్వడమేంటని ప్రశ్నించారు.

ఒకవేళ నిజంగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే ఆమోదించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం దారుణమని అన్నారు. ఫిరాయింపుల విషయంలో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని చెప్పారు.
ఏప్రిల్ 7న అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. అన్ని పార్టీల నేతలను కలిసి ఏపీలోని పరిస్థితులను వివరించనున్నట్లు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు అనైతికమని, ఫిరాయింపుల వ్యవహారం ఒక్క పార్టీకి సంబంధించినది కాదని అన్నారు. పార్టీ మారిన వారిపై నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications