Karnataka bus strike:స్తంభించిన ప్రజా రవాణా -ఆర్టీసీ సిబ్బందికి ఎస్మా వార్నింగ్ -పరీక్షలు వాయిదా
కర్ణాటకలో ప్రజారవాణా దాదాపుగా స్తంభించడంతో జనం ఇక్కట్లకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మె చేపట్టడంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మెకు దిగితే ఎస్మా చట్టం కింద ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా, కార్మికులు వెనక్కి తగ్గలేదు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పలు యూనివర్సిటీలు ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి.
ఆరవ వేతన సంఘం (పే కమిషన్) సిఫార్సులకు అనుగుణంగా జీతాలు పెంచాలన్న డిమాండ్ కు ప్రభుత్వం నిరాకరించడంతో కార్మికులు సమ్మెకు దిగారు. కర్ణాటక స్టేట్ రోడ్డు రవాణ సంస్థ (కేఎస్ఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్, నార్త్ వెస్ట్రన్ కర్ణాటక రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్, నార్త్ ఈస్ట్రన్ కర్ణాటక రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.
సమ్మె నేపథ్యంలో మంగళవారం కార్మిక సంఘాల నేతలకు, ప్రభుత్వానికి మధ్య కీలక చర్చలు జరిగాయి. కేఎస్ఆర్టీసీ కార్మికుల 9 డిమాండ్లలో 8 డిమాండ్లను తాము అంగీకరించామని కముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రవాణాశాఖ ఉద్యోగులకు 6వ వేతన కమిషన్ సిఫార్సులను అమలుచేయడం సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్ స్పష్టం చేశారు. దీంతో డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మె బాట పట్టకతప్పలేదు.
ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు -కోర్టు తీర్పుపై విజయసాయిరెడ్డి -పరిషత్ ఎన్నికల స్టేపై విచారణ వేళ
ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. ప్రయాణికుల కోసం అదనంగా రైళ్లు నడపాలని కర్ణాటక సర్కారు రైల్వే శాఖను కోరింది. సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా కలబురాగీ, బెల్గావి, హుబ్లీ, మైసూర్ ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులను ప్రత్యామ్నాయంగా తిప్పాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది.