పక్క రాష్ట్రంలో 15-18 వయస్సు వారికీ వ్యాక్సిన్: నైట్ కర్ఫ్యూ: బోర్డర్ క్లోజ్: బూస్టర్ డోసులు కూడా
బెంగళూరు: కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ కట్టు తప్పింది. రోజురోజుకూ ఈ వేరియంట్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 422కు చేరింది. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 17 రాష్ట్రాల్లో వ్యాపించింది. ఈ వేరియంట్ వల్ల ఇప్పటిదాకా మరాణాలేవీ నమోదు కాలేదు. కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్రాలు ఆంక్షలను విధిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చాయి.
కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ..
తాజాగా పొరుగు రాష్ట్రం కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేయనుంది బొమ్మై సర్కార్. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. కొద్దిసేపటి కిందటే బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. 10 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
అత్యవసర భేటీ..
కరోనా వైరస్ పరిస్థితులను సమీక్షించడానికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ ఉదయం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ డాక్టర్ కే సుధాకర్, బృహన్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు ఇందులో పాల్గొన్నారు. పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు. అనంతరం ఈ వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు.
15-18 వయస్సున్న వారికీ వ్యాక్సిన్..
15 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు సుధాకర్ చెప్పారు. జనవరి 3వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నామని అన్నారు. 15-18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలు 43 లక్షల మంది వరకు ఉన్నట్లు గుర్తించామని, దశలవారీగా వారికి వ్యాక్సిన్ అందిస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ కొరత లేదని, అందుకే దీన్ని చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.
75 శాతం మందికి రెండో డోస్ వ్యాక్సిన్..
రాష్ట్రంలో 75 శాతం మందికి రెండో డోస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చామని సుధాకర్ అన్నారు. బూస్టర్ డోసులను కూడా సిద్ధం చేస్తోన్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించిన విధంగా జనవరి 10వ తేదీ నుంచి అర్హులైన వారికి బూస్టర్ డోసులను ఇవ్వడాన్ని మొదలు పెట్టబోతోన్నామని అన్నారు. తొలిదశలో 60 సంవత్సరాలు పైనున్న వయస్సు ఉన్న వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి బూస్టర్ డోసులను ఇస్తామని పేర్కొన్నారు.
30 నుంచి ఆంక్షలు..
ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్స్పైనా ఆంక్షలను విధించినట్లు సుధాకర్ చెప్పారు. 50 శాతం సీట్ల సామర్థ్యం వరకే అనుమతి ఇచ్చామని అన్నారు. అందులో పని చేసే ప్రతి సిబ్బంది కూడా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ లేదా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నట్లు ధృవీకరణ పత్రాలను అందజేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అవి లేని వారికి అనుమతి ఇవ్వబోమని అన్నారు.