మరణం తరువాత కూడా: ఇద్దరికి కంటి వెలుగును ప్రసాదించిన పునీత్: అంధులకు అమర్చిన నేత్రాలు
బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ చలనచిత్ర పరిశ్రమ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్..మరణం తరువాత కూడా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. ఆయన దానం చేసిన కళ్లు.. ఇద్దరి జీవితాల్లో వెలుగును నింపింది. ఆ ఇద్దరి కంటి వెలుగుగా మారారు పునీత్. జీవించి ఉన్నప్పుడు గొప్ప నటుడిగానే కాకుండా అంతకుమించి మానవతా వాదిగా పేరు తెచ్చుకున్నారు. తన కళ్లను దాని చేసి.. మరణం తరువాత కూడా ఇద్దరి జీవితాల్లో నెలకొన్న చీకట్లను తొలగించింది.
తన తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్కుమార్, తల్లి పార్వతమ్మ తరహాలోనే పునీత్ రాజ్కుమార్.. తన నేత్రాలను దానం చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన కన్నుమూశారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించిన వెంటనే- శస్త్ర చికిత్స చేసి డాక్టర్లు కళ్లను తొలగించారు. వాటిని పునీత్ రాజ్కుమార్ కుటుంబ సభ్యులు వాటిని నారాయణ నేత్రాలయకు డొనేట్ చేశారు. శనివారం మధ్యాహ్నం ఒక కంటిని చూపులేని ఓ వ్యక్తికి అమర్చారు నారాయణ నేత్రాలయ డాక్టర్లు. ఈ ఉదయం మరో కంటిని మరొకరికి అమర్చారు.
ఈ రెండు శస్త్రచికిత్సలు విజయవంతం అయ్యాయని డాక్టర్లు ప్రకటించారు. దీనిపై ఓ ప్రకటన విడదల చేశారు. ఆ కళ్లను ఎవరికి అమర్చారనే విషయాన్ని వెల్లడించలేదు. పునీత్ రాజ్కుమార్ డొనేట్ చేసిన రెండు కళ్లను తాము అవసరార్థులకు అమర్చామని స్పష్టం చేశారు. శనివారం ఒకరికి, ఇవ్వాళ మరొకరికి వాటిని అమర్చామని, దీనికి సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతమైందని పేర్కొన్నారు. మరణం తరువాత కూడా ఇద్దరు జీవితాలో పునీత్ రాజ్కుమార్ వెలుగు నింపారని వ్యాఖ్యానించారు.
కాగా- పునీత్ రాజ్కుమార్ పార్థివ దేహాన్ని ఖననం చేసిన కంఠీరవ స్టూడియోలోనికి బయటి వ్యక్తులను ఎవరినీ రానివ్వలేదు. ఆచారం ప్రకారం.. అంత్యక్రియలు ముగిసిన అనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలు ఉన్నందున మంగళవారం వరకూ ఎవరినీ లోనికి రానివ్వబోమని రాజ్కుమార్ కుటుంబం తెలిపింది. అభిమానులు సహకరించాలని కోరింది. మంగళవారం తరువాత స్టూడియోలోనికి అనుమతి ఇచ్చినప్పటికీ.. సమాధి వద్దకు ఎవ్వరినీ ఇప్పుడిప్పుడే రావొద్దని విజ్ఞప్తి చేసింది.
కంఠీరవ స్టూడియో వద్ద వేలాది మంది అభిమానులు చేరుకుంటోన్నందున పోలీసులు ఆంక్షలు విధించారు. స్టూడియో పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. పునీత్ రాజ్కుమార్.. శుక్రవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎక్సర్సైజ్ చేస్తోన్న సమయంలో గుండెపోటు సంభవించింది. వెంటవెంటనే రెండుసార్లు ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. భార్య అశ్విని రేవంత్, కుమార్తెలు ధృతి రాజ్కుమార్, వందిత రాజ్కుమార్ ఉన్నారు. ఈ ఉదయం 8 గంటలకు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలను పూర్తి చేశారు.