కర్నాటక ఎన్నికల్లో ఓట్ ఫ్రమ్ హోం-దేశంలో తొలిసారి ! ఎవరెవరికంటే ?
కర్నాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ఓ కీలక ప్రయోగం చేస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఓటు వేసే వారి సంఖ్యను మరింత పెంచేందుకు వీలుగా ఓట్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తోంది.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 5.21 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇందులో 80 ఏళ్లకు పైగా వయసున్న ఓటర్లు 12.15 లక్షల మంది ఉన్నారు. వీరు పోలింగ్ బూత్ లకు రావడంలో విఫలమైతే ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈసీ భావిస్తోంది. అలాగే 16976 మంది ఓటర్లు 100 అంతకు పైగా వయస్సు ఉన్న వారు ఉన్నారు. వీరిని పోలింగ్ బూత్ లకు రప్పించలేని పరిస్ధితి. దీంతో వీరికి ఈసీ ఓట్ ఫ్రమ్ ఆప్షన్ కల్పించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లకు, దివ్యాంగులకు కూడా ఈసారి ఇంటి నుంచి ఓటేసే అవకాశం కల్పించబోతున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. వీరికి సర్వీస్ ఓటర్ల తరహాలో బ్యాలెట్ ఓట్లను సేకరిస్తారా లేక ఈవీఎంలను ఇళ్లకే పంపి ఓటు వేయిస్తారా అన్నది ఈసీ వెల్లడించాల్సి ఉంది. మొత్తం మీద 80 ఏళ్లు పైబడిన వారందరికీ ఇంటి నుంచే ఓటు హక్కు కల్పించడంతో ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతాలపై ఈ ప్రభావం పడే అవకాశముంది. అలాగే దివ్యాంగులకు కూడా పోలింగ్ స్టేషన్లకు రావాల్సిన అగత్యం తప్పుతుంది.












Click it and Unblock the Notifications