బెంగళూరులో కరోనా కల్లోలం: దేశంలో రెండో నగరంగా రికార్డు, డబుల్ మ్యూటెంట్తో వేగంగా వ్యాప్తి
బెంగళూరు: గత కొద్ది రోజులుగా దేశంలో మహారాష్ట్ర తర్వాత కర్ణాటక రాష్ట్రంలోనే కరోనావైరస్ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యమంగా కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరులోనే రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం ఉంటుండటం ఆందోళనకరంగా మారింది.
బెంగళూరులో దాదాపు 10శాతం మంది కరోనా బారినపడ్డారు..
ప్రస్తుతం బెంగళూరు నగరంలో కరోనా బారినపడినవారి సంఖ్య 10 లక్షలకు చేరువలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం బెంగళూరు నగరంలో 9.83 లక్షల కరోనా కేసులున్నాయి. ఈ సంఖ్య నగర జనాభాలో దాదాపు 10 శాతం ఉండటం గమనార్మం. దేశంలో ఇప్పటికే 10 లక్షల కేసులు దాటిన నగరం ఢిల్లీ ఒక్కటే ఉండగా, ఇప్పుడు రెండో నగరంగా బెంగళూరు రికార్డులకెక్కనుంది.
ఢిల్లీ తర్వాత బెంగళూరులోనే అత్యధిక కరోనా కేసులు
కాగా, ఢిల్లీలో 13.3 లక్షల కరోనా కేసులున్నాయి. మంగళవారం బెంగళూరు నగరంలో కొత్త 15,879 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, బెంగళూరులో మరణాలు తక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో ఇప్పటి వరకు 19,000 కరోనా మరణాలు సంభవించగా, ముంబైలో 13,000, పుణెలో 10,000 మరణాలు సంభవించగా.. బెంగళూరులో 8690 మంది మరణించారు. అయితే, కర్ణాటక మాత్రం మహారాష్ట్ర తర్వాత ఎక్కువ మరణాలు సంభవించిన రాష్ట్రంగా ఉంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో 34 శాతం పాజిటివిటీ రేటు ఉండగా, 1.21 శాతం మరణాల రేటు ఉంది.
పాజిటివిటీ రేటు 5శాతానికి తగ్గిస్తామంటున్న ప్రభుత్వం
కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డీకే సుధాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరణాలు రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. పాజిటివిటీ రేటును 5 శాతంకు తగ్గించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఆస్పత్రుల్లో వెంటలేటర్ల సదుపాయాన్ని కూడా పెంచుతున్నామని తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అయితే, బెంగళూరు నగరంలో లక్ష కరోనా టెస్టుల నుంచి 33వేలకు తగ్గించడం గమనార్హం.
Recommended Video
డబుల్ మ్యూటెంట్తో పెరుగుతున్న కేసులు
ఇప్పటి వరకు రాష్ట్రంలో 148 రోగులు డబుల్ మ్యూటెంట్(బీ.1.617) బారినపడినట్లు గుర్తించారు. 86 మంది యూకే స్ట్రెయిన్ బారినపడ్డారు. మరో ఆరుగురు సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్తో బాధపడుతున్నారు. అయితే, డబుల్ మ్యూటెంట్ వైరస్ మిగితా రకాల కంటే వేగంగా వ్యాపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం అధిక కరోనా పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రెమిడిసివిర్ ఔషధాన్ని సరఫరా చేయడంలో విఫలమైన పలు ఫార్మా కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం నోటీసులు పంపింది. ఔషధాల పంపిణీ వేగం పెంచాలని కోరింది.