బంగారం..రాత్రికి రాత్రే సీన్ మారింది..!
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఒక్క రోజు తగ్గినట్టే కనిపించిన పసిడి ధర, మరుసటి రోజే ఊహించని విధంగా భారీగా ఎగబాకింది. దీంతో మరోసారి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసి, సామాన్యులకు అందకుండా పోతోంది. అయితే, బంగారం కంటే కూడా వెండి ధరల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. రోజుకు రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు పెరుగుతుండటం గమనార్హం.
భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. పండుగలు, శుభకార్యాల సమయంలో ఆభరణాలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. కానీ, గత కొంతకాలంగా అంతర్జాతీయ అనిశ్చితి, అమెరికా దిగుమతి సుంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు, కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వల పెరుగుదల వంటి కారణాల వల్ల పసిడి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్టుబడులు కూడా ఈ దిశగా మళ్లడంతో ధరలు రోజురోజుకూ జీవన కాల గరిష్టాలను తాకుతున్నాయి.

రాత్రికి రాత్రే సీన్ మారింది
కిందటి రోజు భారీగా తగ్గిన ధరలు చూసి సంబరపడేలోపే, రాత్రికి రాత్రే మార్కెట్ సీన్ మారిపోయింది. బంగారం, వెండి ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటాయి.
హైదరాబాద్లో తాజా ధరలు (ఒక్కరోజు పెరుగుదల తర్వాత)
22 క్యారెట్ల బంగారం: ఒక్క రోజులో ఏకంగా రూ. 1,250 పెరగడంతో, తులం ధర ఇప్పుడు రూ. 1,14,650కి చేరింది.
24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): 10 గ్రాములకు రూ. 1,370 ఎగబాకి, రూ. 1,25,080 రికార్డు స్థాయిని తాకింది.
వెండి ధరల సునామీ: కేజీ రూ. 1.90 లక్షలు
బంగారం కంటే కూడా వెండి ధరల పెరుగుదల భయపెడుతోంది. తాజాగా మరో రూ. 6,000 పెరగడంతో, ఇప్పుడు కిలో వెండి ధర ఏకంగా రూ. 1.90 లక్షలు పలుకుతోంది. దీనికి ముందు కూడా వరుసగా రెండు రోజుల్లో రూ. 7 వేల చొప్పున పెరిగింది. కేవలం ఆరు రోజుల్లోనే వెండి ధర రూ. 25 వేలు పెరగడం గమనార్హం.
ఈ ధరాభారంతో, శుభకార్యాలకు కొనుగోళ్లు జరపాలనుకునే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. గోల్డ్ రేటు మరింత పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే మీమాంసలో కొనుగోలుదారులు వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications