చివరి త్రైమాసిక ఫలితాలు: ఇన్ఫోసిస్ లాభం రూ.3,690 కోట్లు
ముంబై: ఇన్ఫోసిస్ 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను చివరి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. జనవరి - మార్చి త్రైమాసికానికి గాను ఇన్ఫోసిస్ రూ.3,690 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 28.2 శాతం క్షీణించింది. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 5,129 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
అయితే 2016-17 సంవత్సరానికి నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 2.4 శాతం వృద్ధి సాధించింది. గత ఏడాది జనవరి -మార్చిలో సంస్త లాభం రూ.3603 కోట్లుగా ఉంది.
ఈ త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.18,083 కోట్లు కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2017-2018 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ లాభం 11.7 శాతం పెరిగింది.
ఆదాయం 3 శాతం పెరిగి రూ.70,522 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ సీఈవోగా సలీల్ పరేఖ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన తొలి త్రైమాసిక ఫలితాలు ఇవి.