RBI: వానలు తగ్గితే మళ్లీ ధరల మంట? సామాన్యుడి జేబుకు 'వర్షం' చిల్లు
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, ముడిచమురు సెగలు, అంతర్జాతీయ వాణిజ్యంలో అయోమయం నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక రథం ఏమాత్రం తడబడకుండా ముందుకు సాగుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. తన తాజా ఆగస్టు బులిటెన్లో దేశ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. మన పరిశ్రమలు, కంపెనీల లాభాలు, స్థానిక అవసరాలు బలంగా ఉన్నందున మన వ్యవస్థ పటిష్టంగానే ఉన్నప్పటికీ.. రానున్న రోజుల్లో వర్షభావ పరిస్థితులు, పెరిగే నిత్యావసరాల ధరలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.
పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజల కొనుగోలు శక్తి ఊపందుకోవడం ఆర్థిక వ్యవస్థకు పెద్ద కొండంత అండగా నిలిచింది. ముఖ్యంగా ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరగడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంద అనడానికి స్పష్టమైన నిదర్శనమని ఆర్బీఐ తెలిపింది. పారిశ్రామిక ఉత్పత్తులు, సేవా రంగాలు ఆశాజనకంగా ఉన్నాయని, భవిష్యత్తుపై వ్యాపార వర్గాల్లో పూర్తి నమ్మకం కనిపిస్తోందని విశ్లేషించింది. ఈ సానుకూల వాతావరణం కారణంగానే మన వృద్ధి రేటు స్థిరంగా కొనసాగుతోంది.

సామాన్యుడి జేబుకు 'వర్షం' చిల్లు పొడిచేనా?
ఒకవైపు ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్తూనే, ఇంకోవైపు సామాన్యుడికి ఆర్బీఐ ఒక హెచ్చరిక జారీ చేసింది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రుతుపవనాలు బలహీనపడితే వ్యవసాయ దిగుబడులు తగ్గిపోతాయి. ఇది కాస్తా మార్కెట్లో బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, వంటనూనెల ధరలు మరింత మండేలా చేసే ప్రమాదం ఉంది. జులై నాటికే ఆహార ఉత్పత్తుల ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోందని నివేదిక గుర్తుచేసింది.
ముందుంది వడ్డీ రేట్ల బాదుడు?
ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడం, పైగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో ఆర్బీఐ అప్రమత్తమైంది. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రుణాలపై వడ్డీ రేట్లను పెంచక తప్పకపోవచ్చనే సంకేతాలను ఇచ్చింది. పారిశ్రామిక ఉత్పత్తి వ్యయం తగ్గకపోవడం కూడా భవిష్యత్తులో ఒత్తిడిని పెంచే అంశమే. మొత్తానికి దేశీయంగా డిమాండ్ బాగానే ఉన్నా, వానలు.. నిత్యావసరాల ధరలే రానున్న రోజుల్లో భారత ఆర్థిక రథానికి అసలైన పరీక్ష పెట్టనున్నాయి.














Click it and Unblock the Notifications