Gold: కస్టమ్స్లో చిక్కుకున్న 5 టన్నులు! భారీగా పెరగనున్న ధరలు?
భారత బ్యాంకులు విదేశాల నుంచి బంగారం, వెండి ఆర్డర్లను అకస్మాత్తుగా నిలిపివేసాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (DGFT) నుంచి రావాల్సిన వార్షిక అనుమతులు పెండింగ్లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే (ఏప్రిల్ మొదటి వారంలో) దిగుమతి చేసుకునే బ్యాంకుల జాబితాను DGFT పునరుద్ధరిస్తుంది. కానీ, ఏప్రిల్ సగం దాటినా ఇంకా ఆమోద ముద్ర పడకపోవడం బులియన్ మార్కెట్లో కలకలం రేపుతోంది.
రాయిటర్స్ కథనం ప్రకారం.. ప్రస్తుతం ముంబై, ఇతర నగరాల్లోని కస్టమ్స్ విభాగాల్లో సుమారు 5 టన్నుల బంగారం, 8 టన్నుల వెండి క్లియరెన్స్ లేక పేరుకుపోయినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరం (మార్చి 31, 2026) నాటికే పాత అనుమతులు ముగిసిపోవడంతో, విదేశాల నుంచి వచ్చిన సరుకును దేశంలోకి అనుమతించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. "ముందు వచ్చిన లోహాలే క్లియర్ కానప్పుడు, కొత్తగా విదేశీ ఆర్డర్లు పెట్టి రిస్క్ తీసుకోలేం" అని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

డాలర్ ఒత్తిడి.. ఇరాన్ యుద్ధ ప్రభావం?
అనుమతుల జాప్యం వెనుక ప్రభుత్వం ఒక 'మాస్టర్ ప్లాన్' అమలు చేస్తోందా? అన్న అనుమానాలు వ్యాపార నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ వివాదం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు, గ్యాస్, ఎరువుల ధరలు పెరిగాయి. దీనివల్ల ఏప్రిల్లో భారత్ దిగుమతి బిల్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆసియా కరెన్సీలలో రూపాయి విలువ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బంగారం దిగుమతులను తగ్గించడం ద్వారా డాలర్ బయటకు వెళ్లకుండా అడ్డుకుని, రూపాయి విలువను కాపాడే ప్రయత్నం కేంద్రం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే స్పాట్ డాలర్ కొనుగోళ్లను తగ్గించాలని ఇప్పటికే రిఫైనరీలను ప్రభుత్వం ఆదేశించడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
అక్షయ తృతీయకు సరఫరా గండం!
భారత్లో బంగారం కొనుగోళ్లకు అత్యంత పవిత్రమైన పండుగ 'అక్షయ తృతీయ'. ఈ సమయంలో డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుతుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) కార్యదర్శి సురేంద్ర మెహతా హెచ్చరించినట్లుగా, ఈ అనుమతుల జాప్యం ఇలాగే కొనసాగితే మార్కెట్లో తీవ్రమైన 'సరఫరా కొరత' ఏర్పడుతుంది. ప్రస్తుతం ETF విముక్తి (Redemptions) ద్వారా వస్తున్న బంగారం మార్కెట్ అవసరాలను కొంతమేర తీరుస్తున్నప్పటికీ, అది సరిపోదు. అక్షయ తృతీయ వేళ ప్రజలు బంగారం కొనాలనుకున్నప్పుడు స్టాక్ లేకపోతే, అక్రమ రవాణా (Smuggling) పెరగడమే కాకుండా, దేశీయ ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం.
ప్రపంచ మార్కెట్పై ప్రభావం..
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వినియోగదారు అయిన భారత్.. తన ఆర్డర్లను ఆపేయడం అంతర్జాతీయ మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తోంది. డిమాండ్ పడిపోతుందన్న సంకేతాలతో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు కొంతమేర తగ్గే అవకాశం ఉన్నా, అది తాత్కాలికమే.
మొత్తానికి, DGFT వెంటనే స్పందించి అనుమతులు జారీ చేయకపోతే, పండుగ వేళ పసిడి ప్రియులకు 'ధరల షాక్' తప్పేలా లేదు. ప్రభుత్వం ఆర్థిక లోటును సర్దుబాటు చేసేందుకు సామాన్యుడి సెంటిమెంట్ను పణంగా పెడుతుందా లేదా అన్నది చూడాలి.














Click it and Unblock the Notifications