ముగిసిన నానో కారు జర్నీ?: గత ఏడాది కేవలం ఒకటే తయారీ, 3 అమ్మకం
సనంద్: టాటా నానో కారు జర్నీ ముగింపు దశకు చేరిందా? అంటే అవుననే అంటున్నారు. గత నెల.. అంటే జూన్లో సనంద్ ప్లాంట్లో కేవలం ఒకే నానో కారు తయారయింది. రతన్ టాటా కలలుగన్న కారు నానో కారు. ఉత్పత్తి ప్రారంభించిన తొలి నాళ్లలో దీనికి ప్రచారం కూడా భారీగా సాగింది. నానో కారు కారణంగా నాటి వరకు చిన్న కార్లుగా ఉన్న వాటి ధరలు పడిపోయాయి.
తొలుత నానో కార్లు బుకింగ్ చేసిన వారికి రూ.లక్షకే అందించారు. అయితే ఆ తర్వాత వ్యయం పెరగడంతో 2017 వచ్చేసరికి ధర రూ.2,15,000 అయింది. కారు విడుదల చేసిన తర్వాత తొలి రెండేళ్లలో 70,000 కార్ల చొప్పున అమ్మకం జరిగింది. డిమాండ్ బాగుందని భావించి ఏడాదికి 2,50,000 కార్ల తయారీకి కూడా రంగం సిద్ధం చేశారు.
కానీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 7,591 కార్లను మాత్రమే అమ్మగలిగారు. ఆదరణ పడిపోయింది. గత నెలలో దేశీయ మార్కెట్లో అమ్ముడుపోయిన నానో కార్లు కేవలం మూడే. అందుకే తయారీని తగ్గించి, ఒక్కటే కారును ఉత్పత్తి చేశారు.
జూన్లో నానో కార్ల ఎగుమతులు కూడా ఏమీ లేవు. గత ఏడాది ఇదే నెలలో 25 కార్లను సంస్థ ఎగుమతి చేసింది. గత ఏడాది జూన్లో 275 కార్లను ఉత్పత్తి చేసి మన దేశంలో 167 కార్లను విక్రయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో నానో కార్ల ఉత్పత్తిని కొనసాగించడం కుదరదని తమకు తెలుసునని, 2019 తర్వాత కొత్త పెట్టుబడులు పెడితేగానీ ఉత్పత్తి చేసే పరిస్థితి లేదని, ఇంకా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నానో కార్ల డిమాండ్ ఉన్న మార్కెట్ల కోసం ఈ కార్ల ఉత్పత్తి చేస్తామని చెబుతున్నారు.