టీసీఎస్ బంపర్ ఆఫర్: 16వేల కోట్ల షేర్లు బైబ్యాక్
న్యూఢిల్లీ: దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) షేర్ల బై బ్యాక్కు ఆ సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. పెట్టుబడిదారుల దగ్గర నుంచి రూ.16వేల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ ఆఫర్ కింద టీసీఎస్ కొనుగోలు చేయనుంది. కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్లో ఇది 1.99శాతానికి సమానం.
ఒక్కో షేరు విలువ రూ.2,100గా నిర్ణయించింది. బైబ్యాక్ ఆఫర్పై నిర్ణయం తీసుకునేందుకు శుక్రవారం బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో షేర్ల బైబ్యాక్కు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. జూన్ 13నే బైబ్యాక్ ఆఫర్ గురించి రెగ్యులేటరీ ఫైలింగ్లో టీసీఎస్ వెల్లడించింది.
గత సంవత్సరం ఫిబ్రవరిలో కూడా టీసీఎస్ రూ.16వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. అప్పుడు ఒక్కో షేర్ విలువ రూ.2,850గా నిర్ణయించింది. షేర్ల బైబ్యాక్ వార్తలతో ఆ కంపెనీ షేర్లు గురువారం నుంచి భారీ లాభాల్లో పయనిస్తున్నాయి.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లో శుక్రవారం టీసీఎస్ షేరు 3శాతం పెరిగింది. ఒక్కో షేర్ ధర రూ.1840కు చేరింది. ఈ ఏడాది మొత్తం టీసీఎస్ 34శాతం లాభపడింది. ఇటీవలే టీసీఎస్ వాటాదార్లకు బోనస్ షేర్ను కూడా ప్రకటించడం గమనార్హం.