పెద్దన్నా.. మజాకా! ఇనుము, అల్యూమినియం దిగుమతిపై ట్రంప్ ‘సుంకం’.. ప్రపంచ దేశాలు గగ్గోలు!!
Recommended Video
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన మనస్సుకు తోచిందే చేస్తున్నారు. హెచ్ 1 బీ వీసా విషయమైనా.. ముస్లిం దేశాల పౌరుల రాకపైనా.. ఏ విషయంలోనైనా తాను 'ఫస్ట్ అమెరికన్' నినాదానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే బాటలో మరో అడుగు ముందుకు వేశారు. ఇటీవల ఇనుము దిగుమతిపై 25 శాతం, అల్యూమినియం దిగుమతిపై 10 శాతం విధిస్తామని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ప్రకటన చేశారు.
ట్రంప్ అన్నంత పని చేశారు. అధికారికంగా డిక్రీ చేశారు. అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై 25%, 10% చొప్పున సుంకం విధించే ఆదేశాలపై సంతకాలు చేయడానికి ముందు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తమ వస్తువులపై భారత్, చైనా ఎంత దిగుమతి సుంకం విధిస్తున్నాయో అంతే సుంకాన్ని వాటికి కూడా వర్తింపజేస్తామని హెచ్చరించారు.
విదేశాల అనుచిత వైఖరి వల్లే తమ ప్లాంట్లు మూతపడ్డాయన్న ట్రంప్
ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలు రెండూ.. దేశ భద్రతకు సైతం కీలకమైనవని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ఉక్కు ఉక్కే. దీనికి తిరుగులేదు. ఉక్కు లేకుంటే దేశం లేదు. అనేక ఏళ్లుగా మన పరిశ్రమలను మిగతా దేశాలు లక్ష్యంగా చేశాయి. నిజానికి దశాబ్దాలుగా పాటిస్తూ వస్తున్న అనుచిత విదేశీ వాణిజ్య విధానాల వల్ల మన ప్లాంట్లు మూతపడ్డాయి. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని వర్గాలు పూర్తిగా అణగారిపోయాయి. ఇకపై ఇలాంటివన్నీ ఆగిపోతాయి‘ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా ప్రయోజనాల కోసమేనని అధ్యక్షుడి స్వోత్కర్ష
ఉక్కు, అల్యూమినియంపై సుంకాల విధించడం ద్వారా అమెరికా భద్రతను కూడా కాపాడుతున్నానని ఆయన చెప్పుకున్నారు. అమెరికాలో ఉక్కు, అల్యూమినియం రంగంలో పెరుగుతున్న సంక్షోభం గురించి వాణిజ్య శాఖ తొమ్మిది నెలలుగా అధ్యయనం చేశాక ఈ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. అమెరికా ఉద్యోగులు, కంపెనీల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికాలో తయారు చేసే ఉత్పత్తులపై పన్నులు ఉండవని.. ఒకవేళ ఇతర దేశాల కంపెనీలేవైనా ఆ ప్రయోజనాలు పొందదల్చుకుంటే, అమెరికాలోనే ప్లాంటు పెట్టి పొందవచ్చని తెలియజేశారు.
ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోనే మిశ్రమ స్పందన
‘మన నౌకలు, మన విమానాలు.. మన యుద్ధ పరికరాలు మొదలైన వాటినీ మన దేశంలో తయారైన ఉక్కు, అల్యూమినియంతోనే ఉత్పత్తి చేద్దాం. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుంటున్నాం' అని ట్రంప్ అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోనే దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొని వర్గాలు అమెరికాకు ప్రయోజనకరమైన చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించగా మరికొన్ని వర్గాలు ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
మెక్సికో, కెనడాలకు సుంకం విధింపులో మినహాయింపు
‘చైనా 25%, భారత్ 75% పన్ను వేసినా మేం మాత్రం ఎటువంటి పన్ను విధించడం లేదు. ఇప్పుడు 50 లేదా 75 లేదా 25 సంఖ్య ఏదేనా మేమూ అదే వర్తింపజేస్తాం. దీనినే రెసిప్రోకల్ విధానం అంటారు' అని అన్నారు. అమెరికాలో తయారయ్యే హార్లే డేవిడ్సన్ మోటర్సైకిళ్లపై భారత్ అధిక సుంకం విధిస్తోందని ఇటీవల ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. సుంకాల విధింపు విషయంలో పనిలో పనిగా చైనాతో పాటు భారత్కు కూడా హెచ్చరికల్లాంటివి చేశారు ట్రంప్. చైనా, భారత్ లాంటి దేశాలు విధించే సుంకాలకు, అమెరికా విధించే సుంకాలకూ వ్యత్యాసముంటే ఆ మేరకు మార్పులుంటాయన్నారు. ట్రంప్ నిర్ణయం మేరకు దిగుమతి సుంకాలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయి. పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
సుంకాల వల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే
ఇంజనీరింగ్ ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఈపీసీ) చైర్మన్ రవి సెహ్గల్ తెలిపారు. అమెరికా బాటలోనే చైనా, యూరప్ కూడా రక్షణాత్మక చర్యలకు దిగితే భారత ఎగుమతులు మరింతగా దెబ్బతింటాయన్నారు. అమెరికా దిగుమతి చేసుకునే మొత్తం ఉక్కులో భారత్ వాటా 1.28 శాతంగా, అల్యూమినియం దిగుమతుల్లో 1.12 శాతంగా ఉంది. మరోవైపు, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మార్చి 20న భారత్ నిర్వహించబోయే డబ్ల్యూటీవో సదస్సుకు అమెరికా ప్రతినిధి రాబర్ట్ లైథిజర్ రాకపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
డబ్ల్యూటీవోకు ఫిర్యాదు చేస్తామని దక్షిణ కొరియా హెచ్చరిక
దిగుమతి సుంకాల విధింపుపై చైనాతో పాటు యూరోపియన్ యూనియన్లోని అమెరికా వ్యాపార భాగస్వామ్య దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించాయి. సుంకాల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా పేర్కొనగా.. ఇరు దేశాల సంబంధాలపై ఇది పెను ప్రభావం చూపుతుందని జపాన్ వ్యాఖ్యానించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలో (డబ్ల్యూటీవో) ఫిర్యాదు చేసే అవకాశం ఉందని దక్షిణ కొరియా వెల్లడించింది.
అమెరికా వ్యాపార భాగస్వామ్య దేశాల వ్యతిరేకత
మిగతా దేశాలు కూడా మినహాయింపులు కావాలనుకుంటే అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధులతో (యూఎస్టీఆర్) చర్చల ద్వారా సాధించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తం కాగా కీలక వ్యాపార భాగస్వామ్య దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా సుంకం పెంపు ప్రభావం దేశీయ కంపెనీలపై ఏవిధంగా ఉండనుందో అనే అంశాన్ని పరిశీలించేందుకు అమెరికా నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్నామని భారత్ పేర్కొంది.
అంతర్జాతీయ వాణిజ్యంపైనే దాడి అని చైనా వ్యాఖ్య
అమెరికా సుంకం పెంపు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందని ఇప్పటికే ఐరోపా యూనియన్ (ఈయూ), చైనా ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు కొనసాగుతున్న సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉన్నదని కూడా మరికొన్ని దేశాలు హెచ్చరించాయి. ద్వైపాక్షిక సత్సంబంధాలపై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని జపాన్ అభిప్రాయపడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు ఫిర్యాదు చేస్తామని దక్షిణ కొరియా తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థపై అతిపెద్ద దాడిగా చైనా అభివర్ణించింది.
రాయితీ ఇవ్వకుంటే 90 రోజుల్లో చర్యలు తప్పవని ఈయూ హెచ్చరిక
అమెరికాతో స్నేహ సంబంధంతో మెలుగుతున్న తమకు టారీఫ్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈయూ ట్రేడ్ కమిషనర్ సెసిలా మామ్స్ట్రోమ్ ట్వీట్ చేశారు. మినహాయింపుల అవకాశాలను పరిశీలించేందుకు ఈయూ భాగస్వామ్య దేశాలతో కలిసి పని చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. సుంకం పెంపు నుంచి తమకు మినహాయింపు ఇవ్వకుంటే 90 రోజుల్లో తమ చర్యలను ప్రకటిస్తామని ఈయూ హెచ్చరించింది. సుంకాల పెంపునకు ప్రతీకారంగా చర్యలు తీసుకునేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని, అయితే చర్చలకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తామని యూరోపియన్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్ జిర్కీ కెటైనెన్ తెలిపారు.
ఈయూ సభ్యదేశాలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్న ఫ్రాన్స్
అమెరికా చర్యకు ప్రతిచర్యలో భాగంగా ఆ దేశం నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై టారీఫ్ పెంపు అంశాన్ని బ్రజెల్స్ పరిశలిస్తోంది. అమెరికా నుంచి దిగుమతయ్యే ఏయే ఉత్పత్తులపై సుంకాలు విధించవచ్చన్న దానిపై బ్రసెల్స్ ఇప్పటికే ఒక జాబితా కూడా సిద్ధం చేసింది. ఈ వాణిజ్య యుద్ధంలో కేవలం నష్టపోయిన వాళ్లే ఉంటారని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లె మైర్ తెలిపారు. మిగతా యూరోపియన్ యూనియన్ దేశాలతో కలిసి పరిణామాల ప్రభావాలపై చర్చించి, తగు నిర్ణయాలు తీసుకుంటామని ఫ్రాన్స్ పేర్కొంది. వాణిజ్య వివాదాల పరిష్కారానికి టారిఫ్లు విధించడం సరైన పద్ధతి కాదని బ్రిటన్ అభిప్రాయపడింది. రక్షణాత్మక ధోరణులు, టారిఫ్లు పనిచేయవని పేర్కొంది.