బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు... యజమాని సహా ఏడుగురు మృతి...
తమిళనాడులోని కడలూరులో ఉన్న ఓ బాణసంచా కర్మాగారంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా... నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఫ్యాక్టరీ యజమాని కూడా ఉన్నాడు.
పేలుడు ధాటికి కూలిన ఫ్యాక్టరీ శిథిలాల కింద మృతదేహాలు చిక్కుకుపోయాయి. ప్రమాద ఘటన గురించి తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడారు. మృతుల కుటుంబీకులు రోధనలతో అక్కడి వాతావరణం ఉద్విగ్నంగా మారింది.
ప్రమాదంపై కడలూరు ఎస్పీ శ్రీ అభినవ్ మాట్లాడుతూ... కట్టుమన్నార్కోయిల్లో ఉన్న ఆ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఉందన్నారు. మృతులంతా అందులో పనిచేసేవాళ్లేనని చెప్పారు. అనుమతి వున్న పేలుడు పదార్థాలనే ఫ్యాక్టరీలో ఉపయోగిస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ప్రతీ ఏటా దీపావళికి ముందు బాణసంచా ప్రొడక్షన్ పీక్స్లో ఉంటుంది. కానీ ఈసారి కరోనా కారణంగా తయారీ నిలిచిపోయింది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కేవలం 100 మంది సిబ్బందితో పరిశ్రమలు నడిపేందుకు అనుమతినివ్వడంతో ఇప్పుడిప్పుడే అన్ని పరిశ్రమలు రీఓపెన్ అవుతున్నాయి.
కాగా,దేశంలోనే అత్యధికంగా తమిళనాడులో బాణసంచా తయారీ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని శివకాశీ ఒకరకంగా ఫైర్వర్క్స్ కేపిటల్గా కొనసాగుతోంది.