చెన్నై మహిళా ఐపీఎస్ తెగువ-అర్దరాత్రి తనిఖీలతో వార్తల్లోకి-కీలకపోస్టుతో గౌరవించిన స్టాలిన్
నిన్న రాత్రి చెన్నైలో ఓ జాయింగ్ కమిషనర్ స్ధాయి మహిళా ఐపీఎస్ అధికారి రాత్రిపూట తనిఖీలు నిర్వహించారు. అదీ సైకిల్ పై తిరుగుతూ ఈ తనిఖీలు చేపట్టారు. దీంతో ఆమె తెగువ వార్తల్లోకెక్కింది. జాయింట్ కమిషనర్ స్ధాయిలో ఉండీ, మహిళ అయి ఉండీ రాత్రి పూట రోడ్లపై సాధారణ మహిళల తరహాలో పెట్రోలింగ్ నిర్వహించిన ఆమె తెగువ స్టాలిన్ సర్కార్ ను సైతం మెప్పించింది. అంతే ఇప్పుడు ఆమెను ప్రభుత్వం కీలక పోస్టులో నియమించి గౌరవించింది.
మహిళా ఐపీఎస్ తెగువ
చెన్నై నార్త్ జోన్ లో జాయింగ్ కమిషనర్ గా పనిచేస్తున్న ఐపీఎస్ రమ్యా భారతి మొన్న అర్ధరాత్రి రోడ్లపై పెట్రోలింగ్ లో పాల్గొన్నారు. అర్ధరాత్రి పూట స్వయంగా సైకిల్ నడుపుతూ రోడ్లపై ఆమె నిర్వహించిన పెట్రోలింగ్ లో పలువురు అనుమానితుల్ని కూడా పట్టుకున్నారు.
వాలాజా పాయింట్ నుండి ప్రారంభించి ముత్తుసామి బ్రిడ్జి, రాజా అన్నామలై మండ్రం, ఎస్ప్లానేడ్ రోడ్, కురలగం, NSC బోస్ రోడ్, మింట్ జంక్షన్, వాల్ టాక్స్ రోడ్, ఎన్నూర్ హై రోడ్, RK నగర్ మరియు తిరువొత్తియూర్ హై రోడ్తో సహా అనేక ప్రాంతాలను కవర్ చేశారు. రమ్యభారతి పెట్రోలింగ్ వాహనాలను పరిశీలించి, వారి లెడ్జర్లో ఆమె పర్యటనను నమోదు చేశారు.
అధికారుల ఆశ్చర్యం
నైట్ పెట్రోలింగ్ సైకిల్ రైడ్కు వెళ్లిన రమ్య... తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు తెల్లవారుజామున 2.45 గంటల నుంచి 4.15 గంటల వరకు రైడ్ చేస్తూ ఉత్తర చెన్నైలో దాదాపు 9 కిలోమీటర్లు ప్రయాణించి పోలీసు అధికారులను ఆశ్చర్యపరిచారు. ఆమె చూపించిన తెగువ తమిళనాడు పోలీసు శాఖను మెప్పించింది. పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆమె తెగువను అభినందిస్తూ ఫోన్లు కూడా చేశారు. ఈ విషయం కాస్తా ప్రభుత్వ పెద్దలకు చేరింది.
ఉదయానికి సీఎం స్టాలిన్ ట్వీట్
ఉదయం కల్లా రాత్రి పూట పెట్రోలింగ్ ఆమె చూపించిన సాహసం తమిళనాడు సీఎం స్టాలిన్ వద్దకు చేరింది. సీఎం స్టాలిన్ ఐపీఎస్ రమ్యా భారతిని అభినందిస్తూ ట్వీట్ పెట్టారు. రమ్య ఫోటోలు వైరల్ అయిన తర్వాత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్విట్టర్లో , "రమ్య భారతికి అభినందనలు! తమిళనాడులో మహిళలపై హింసను తగ్గించాలని, మహిళలకు భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించాను అంటూ ట్వీట్ చేసారు. దీంతో రమ్యా భారతి ఫీట్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కీలక పోస్టులో రమ్య భారతి
విధి నిర్వహణలో భాగంగా అర్దరాత్రి పూట రోడ్లపై తిరుగుతూ మహిళల భద్రతను పర్యవేక్షించిన ఐపీఎస్ రమ్య భారతి ఫీట్ పై తమిళనాడు పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేసింది. సీఎం కూడా ట్వీట్ చేయడంతో దీనిపై స్పందించిన పోలీసు శాఖ.. ఆమెను డ్రగ్స్పై డ్రైవ్కు నోడల్ ఆఫీసర్గా రమ్యభారతిని చెన్నై పోలీస్ కమిషనర్ నియమించారు. దీంతో ఒక్క రాత్రిలోనే రమ్య భారతి వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. రాష్ట్రంలో మహిళా పోలీసులకు ఆమె ఆదర్శంగా నిలిచారని జనం ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.