తీర ప్రాంతం బిక్కుబిక్కు: రెడ్ అలర్ట్ జారీ: స్కూళ్లు మూసివేత
చెన్నై: తమిళనాడు వరద ముంపులో చిక్కుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయిదు రోజులుగా చెన్నై వరదనీటిలో నానుతోంది. లోతట్టు ప్రాంతాల్లో జలమయం అయ్యాయి. వరద నీరు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అంధకారంలో మగ్గుతున్నారు చెన్నైవాసులు. సగం వరకు మునిగిన ఇళ్లల్లో కాలం గడుపుతున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా ప్రతిరోజూ వరదముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
మరిన్ని భారీ వర్షాలు..
వరదలతో అల్లకల్లోలమౌతోన్న తమిళనాడుకు మరిన్ని భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఇవ్వాళ్టి నుంచి 48 గంటల పాటు తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీర ప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. మత్స్యకారులెవరూ చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తక్షణమే వెనక్కి తిరిగి రావాలని పేర్కొన్నారు.
తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్..
తీర ప్రాంత జిల్లాలతో పాటు అతి భారీ వర్షాలను ఎదుర్కొనే జిల్లాలకు వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. కడలూరు, విల్లుపురం, శివగంగ, రామనాథపురం, కరైకల్, కోయంబత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో అధికారులు పలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించారు. వేలాదిమందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. వారికోసం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు.
తమిళనాడు వ్యాప్తంగా..
తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, నాగపట్టణం, తంజావూరు, పుదుకోట్టై, తిరువరూరు, మైలాడుతురై, సేలం, తిరుచిరాపల్లి, ఆరియలూరు, పెరంబలూరు, మధురై, తిరుచ్చి, థేనిల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆయా ప్రాంతాలన్నింట్లోనూ ఇవ్వాళ ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని సూచించారు. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు.
రాత్రివేళ వరద ముంపు..
రాత్రివేళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం అధికారి, ఐఎండీ ఏరియా సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డైరెక్టర్ ఎన్ పువియరాసన్ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటిదాకా అయిదుమంది భారీ వర్షాలతో దుర్మరణం పాలయ్యారు. 538 పూరిళ్లు, 129 గృహాలు ధ్వంసం అయ్యాయి.
సురక్షిత ప్రాంతాలకు..
లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నై, కాంచీపురంలోని పలు సబర్బన్ ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో చాలా ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 2015 తరువాత ఈ స్థాయిలో భారీ వర్షాలు సంభవించడం ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరో 48 గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉండటంతో వరదపోటు తప్పదనే ఆందోళన వ్యక్తమౌతోంది.
Recommended Video
నిరంతర సమీక్షలు..
ఇప్పటికే వర్షాల పరిస్థితి పైన నిరంతం సమీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసారు. కూలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్, టెలిఫోన్ స్తంభాలను గుర్తించి తక్షణం తొలగించాలని, ప్రాణనష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం అన్ని శాఖలతో కలసి అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. వర్షపు నీటిలోనే తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించటంతో పాటుగా.. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.