దేశంలో ప్రజాస్వామ్యం చచ్చింది-మోడీ రాజీపడతారని చైనాకూ తెలుసు- రాహుల్ గాంధీ
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తూతుకుడిలో జరిగిన ఎన్నికల బహిరంగసభలో పాల్గొన్న రాహుల్.. మోడీ లక్ష్ంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు దేశంలో ప్రజాస్వామ్యమే చచ్చిందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
తమిళనాడులోని తూతుకుడిలో ఉన్న వీఓసీ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన రాహుల్.. చైనా విషయంలో భారత్ వైఖరిపైనా విమర్శలు గుప్పించారు. భారత భూభాగాన్ని కేంద్రం చైనాకు అప్పగించిందని పదే పదే విమర్శలు చేస్తున్న రాహుల్.. మరోసారి ఇదే విషయాన్ని లేవనెత్తారు. భారత ప్రధాని దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడతారని చైనాకూ అర్ధమైందని రాహుల్ మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆరేళ్లుగా దేశంలో ఎన్నికైన వ్యవస్ధలపైనా, మీడియాపైనా వ్యవస్ధీకృత దాడులు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. అసలు దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం ఒక్కసారిగా చనిపోదని, ఇది క్రమంగా జరుగుతుందని రాహుల్ ఆరోపించారు. పార్లమెంటు, న్యాయవ్యవస్ధ, ప్రెస్ వంటి సంస్ధలు దేశాన్ని కలిపి ఉంచుతాయని, ఓ దేశం, దాని సంస్ధల మధ్య సమతుల్యత లోపిస్తే దేశం నాశనం అవుతుందని రాహుల్ తెలిపారు.
దీనికి ఆరెస్సెస్ కారణమన్నారు. భారత్ రాష్ట్రాల యూనియన్ అని, సంస్ధల మధ్య సమతుల్యత లోపిస్తే రాష్ట్రాల మధ్య వివాదాలూ పెరుగుతాయన్నారు. పుదుచ్చేరి, మధ్యప్రదేశ్లో తమ ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి కొనుక్కోవడం ద్వారా బీజేపీ ప్రజల నిర్ణయాన్ని అపహాస్యం చేసిందన్నారు.