వ్యవసాయ మంత్రిని బలి తీసుకున్న కరోనా: ఆసుపత్రిలో తుదిశ్వాస: రాజకీయాల్లో సీనియర్గా
చెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారికి తమిళనాడు మంత్రి బలి అయ్యారు. కరోనా బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పేరు దొరైకన్ను. వయస్సు 72 సంవత్సరాలు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేబినెట్లో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అన్నా డీఎంకే సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు. దొరైకన్ను మరణం పట్ల తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ఎడప్పాడి పళనిస్వామి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
తంజావూరు జిల్లా పాపనాశం నియోజకవర్గానికి ఆయన అసెంబ్లీలో ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. హ్యాట్రిక్ కొట్టారు. 2006, 2011, 2016 ఎన్నికల్లో ఆయన ఘన విజయాన్ని సాధించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆయనను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆమె మరణానంతరం ఏర్పడిన పళనిస్వామి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నారు.

కిందటి నెల 13వ తేదీన దొరైకన్ను కరోనా వైరస్ బారిన పడ్డారు. అనారోగ్యానికి గురైన ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో ఆయనను ఆసుపత్రికి తరలించారు. విల్లుపురంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చికిత్స అందించారు. క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. కరోనాకు చికిత్స పొందుతోన్న సమయంలోనే దొరైకన్ను న్యుమోనియాకు గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శనివారం రాత్రి 11:15 నిమిషాలకు ఆయన మరణించినట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు. ఆయనకు సీటీ స్కాన్ తీశామని, 90 శాతం లంగ్ ఇన్ఫెక్షన్కు గురయ్యారని చెప్పారు. దానికి అనుగుణంగా అత్యాధునిక చికిత్స అందించినట్లు సెల్వరాజ్ చెప్పారు. దొరైకన్ను మరణం పట్ల ముఖ్యమంత్రి, తోటి మంత్రులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగినప్పటికీ.. నిరాడంబరంగా వ్యవహరించేవారని, సామాన్యుల్లో కలిసిపోయేవారని చెప్పారు.












Click it and Unblock the Notifications