హీటెక్కిన తమిళనాడు: డీఎంకే నిరాహార దీక్ష: రైతులు అసాంఘిక శక్తులా?: స్టాలిన్ ఫైర్
చెన్నై: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకవంక మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. ఈ నెలాఖరున రజినీకాంత్ సైతం రాజకీయరంగ ప్రవేశం చేయబోతోన్నారు. తాను నెలకొల్పబోయే రాజకీయ పార్టీని ఆయన అధికారికంగా ప్రకటించనున్నారు. అధికార అన్నాడీఎంకే..భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతోంది.
ఈ పరిణామాల మధ్య ప్రతిపక్ష డీఎంకే.. నిరాహార దీక్షకు పూనుకుంది. ఈ కార్యక్రమంతో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టయింది. దేశ రాజధానిని ముట్టడించిన రైతులకు సంఘీభావంగా, రైతుల ఉద్యమానికి మద్దతుగా డీఎంకే.. ఈ నిరాహార దీక్షను చేపట్టింది. చెన్నైలోని వళ్లువర్ కొట్టం ప్రాంతంలో నిరాహార దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆ పార్టీ ఎంపీలు కణిమోళి, ఇళాంగోవన్, పొత్తు పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులపై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశానికి వెన్నెముకగా భావించే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టడానికే బీజేపీ నేతలు ఈ బిల్లును తీసుకొచ్చారని విమర్శించారు. అత్యంత కఠిన, ప్రతికూల వాతావరణంలోనూ దేశ రాజధాని వెలుపల 23 రోజులుగా ఉద్యమిస్తోన్న రైతులను కేంద్ర ప్రభుత్వ పెద్దలు అసాంఘిక శక్తులుగా అభివర్ణించడం పట్ల అభ్యంతర వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా ఆయన కేబినెట్ మంత్రులు, బీజేపీ నేతలకు.. అన్నం పెట్టే రైతులు అసాంఘిక శక్తులుగా కనిపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్నా డీఎంకే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్నదాతలను రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. తమిళనాడుకు చెందిన వందలాది మంది రైతులు కూడా ఇదివరకు న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున రోజుల తరబడి ఉద్యమించిన సందర్భాన్ని స్టాలిన్ గుర్తు చేశారు.
రైతుల సంక్షేమం పేరుతో వారి ఓట్లతో ఆకర్షించి.. అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే, బీజేపీ ప్రభుత్వాలు వారిని వెన్నుపోటు పొడిచాయని ఆరోపించారు. ఈ పరిస్థితి ఎంతోకాలం కొనసాగబోదని అన్నారు. తమిళనాడులో తమ పార్టీ సారథ్యంలో రైతు సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని భరోసా ఇచ్చారు. దేశ రాజధానిని ముట్టడించిన రైతులకు తాము మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. వారికి సంఘీభావంగా నిరాహార దీక్షను చేపట్టామని అన్నారు.