షాక్: ఆయన గెలిస్తే ఉపఎన్నిక తప్పదు -కరోనాతో కాంగ్రెస్ అభ్యర్థి మాధవ రావు మృతి -శ్రీవిల్లిపుత్తూరులో విషాదం
దేశంలో కరోనా వైరస్ రెండోసారి వ్యాప్తి ప్రమాదకరంగా సాగుతోంది. మొదటి వేవ్ మాదిరిగానే రెండో వేవ్ లోనూ మహమ్మారి కాటుకు బలవుతోన్న రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతున్నది. ఇటీవల ఎన్నికలు పూర్తయిన తమిళనాడులోనూ బరిలో నిలబడ్డ అభ్యర్థులు మృత్యువాత పడుతుండటం కలకలం రేపుతున్నది. కరోనా మహమ్మారి బారినపడి శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు మృతి చెందారు.

తండ్రి కోసం కూతురి ప్రచారం
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ జరగడం తెలిసిందే. విరుదునగర్ జిల్లాలోని శ్రీవిల్లిపుత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాధవ రావు పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఆయన కరోనా సోకడంతో మధురైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. మాధవరావు తరఫున ఆయన కూతురు దివ్యా రావు ప్రచారం నిర్వహించారు..

ఊపిరితిత్తులు దెబ్బతిని..
ఎన్నికల ప్రచారంలో కరోనా కాటుకు గురైన మాధవరావుకు ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పరిస్థితి విషమించింది. ఆదివారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. మాధవరావు మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. ఏఐసీసీ కార్యదర్శి సంజయ్, తమిళనాడు కాంగ్రెస్ నేతలు విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటించారు. మాధవ రావు అంత్యక్రియలకు కుటుంబీకులు ఏర్పాట్లు చేశారు.
Recommended Video

ఆయన గెలిస్తే ఉప ఎన్నిక
ఈ నెల 6న జరిగిన ఎన్నికల్లో శ్రీవిల్లిపుత్తూరులో 73.03 పోలింగ్ శాతం నమోదైంది. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. శ్రీవిల్లిపుత్తూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన మాధవరావు గెలిస్తే గనుక ఇక్కడ ఉప ఎన్నిక తప్పదు. ఆయన కాకుండా వేరే అభ్యర్థి గెలిస్తే ఉప ఎన్నికకు ఆస్కారం ఉండదు. శ్రీవిల్లిపుత్తూరులో ఏం జరుగుతుందో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications