జగన్ గృహప్రవేశం నాడే రోజా కుండబద్దలు - వేణుగోపాల్ మాటే ఫైనల్ - రఘురామకు రాష్ట్రపతి రివర్స్ షాక్
రాజధాని తరలింపుతోపాటు ఆంద్రప్రదేశ్ లో జరుగుతోన్న ప్రతి విషయంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉందని, రాత్రికి రాత్రే రాజధానిని విశాఖపట్నానికి తరలించినా, అక్కడేమీ చేయలేరని, మొత్తంగా కకపోయినా, అమరావతినిఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గానైనా కొనసాగించి తీరాల్సిందేనని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్ లో కోవింద్ ను కలిసి, రెండు కీలక అంశాలపై రిప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన.. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెబల్ ఎంపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

వామ్మో.. మనకంటే ముందే
‘‘సరిగ్గా ఉదయం 11 గంటలంటే.. నిమిషం అటు ఇటు కాకుండా ఠంచనుగా మీటింగ్ మొదలైంది. తన విలువైన సమయంలో నుంచి 23 నిమిషాలను రాష్ట్రపతి నాకు కేటాయించారు. మనం చెప్పాలనుకున్నదానికంటే ఎక్కువగా ఆయనకు ముందే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండటంతో స్టన్నయ్యాను. రాష్ట్రపతికి ఇవ్వాల్సిన లేఖలను ఆదివారమే ప్రిపేర్ చేయడంతో సోమవారం నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పును అందులో మెన్షన్ చేయలేదు. దీంతో ఆయనే ఆ విషయాన్ని ఆరా తీశారు.. ‘మీరు కోర్టుకు కూడా వెళ్లారు కదా..'అని ప్రశ్నించారు. ఏపీ వ్యవహారాలన్నీ అంత థరోగా ఫాలో అవుతున్నట్లు అనిపించింది. నా వ్యక్తిగత భద్రతపై ఒకటి, రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని మరోటి రిప్రెజెంటేషన్ ఇచ్చాను.

ఎమ్మెల్యే రోజా ఆ రోజే తేల్చేశారు..
పార్టీ అభిమానులుగానీ, దురభిమానులుగానీ ఒక విషయంపై క్లారిటీ తెచ్చుకోవాలి. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు లేదా అమరావతి నుంచి రాజధాని తరలింపు అనేది ముమ్మాటికీ వైసీపీ నిర్ణయం కానేకాదు. మేనిఫెస్టోలో ఆ అంశం లేనేలేదు. అది పూర్తిగా ప్రభుత్వ పరమైన నిర్ణయం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మార్చుకున్న విధానం. ఎన్నికలకు ముందు.. జగన్ గెలిస్తే అమరావతిని రద్దు చేస్తారని టీడీపీ ప్రచారం చేసింది. ఎప్పుడైతే ఆయన తాడేపల్లిలో సొంత ఇల్లు కట్టుకున్నారో.. టీడీపీ విషప్రచారానికి చెక్ పెట్టినట్లయిందని, రాజధానిని అమరావతిలోనే కొనసాగించే విషయంలో జగన్న మాటతప్పరంటూ గృహప్రవేశం నాడు ఎమ్మెల్యే రోజా కుండబద్దలుకొట్టారు. అలాంటిదిప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు యూటర్న్ తీసుకున్నట్లే అవుతుంది కదా, పైగా..

కమ్మ కులస్తులు 18 శాతమే..
అమరావతి డిజైన్ కమ్మ సామాజికవర్గం మేలు కోసమేనని మా పార్టీ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. కానీ అక్కడ భూములిచ్చినవాళ్లలో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీలే. కమ్మ కులస్తులు కేవలం 18 శాతం మందే ఉన్నారు. భూములిచ్చిన వాళ్లలో 23 శాతం మంది రెడ్డి కులస్తులున్నారు. రాజధానిని తరలించడం వల్ల ఎస్సీ, ఎస్టీలే ఎక్కువగా నష్టపోతారు. ఇది పార్టీపరమైన నిర్ణయం కాదు కాబట్టే దీనిపై నేను మాట్లాడాను. కేవలం రాజధాని తరలింపునకు అడ్డుగా ఉందని మండలిని రద్దు చేయాలనుకోవడం శాసన వ్యవస్థను అవమానించినట్లే. రేప్పొద్దున అసెంబ్లీలోనూ అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు?

పార్టీని కాపాడుతోన్నది నేనే..
గతేడాది నవంబర్ లో తెలుగు భాషపై చర్చ సందర్భంగా లోక్ సభలో మాట్లాడినప్పటి నుంచి నాపై దాడి మొదలైది. నిజానికి మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజ్యాంగంలోనే ఉంది. అలాంటప్పుడు నిర్బంధ ఇంగ్లీష్ ప్రవేశపెడతామని ఎలా అనగలం? అన్నింటికంటే ప్రధానంగా.. ఇంగ్లీషు మీడియం అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం.. దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి రఘురామపై చర్యలు తీసుకోండని కేంద్ర పెద్దలను మా పార్టీ నేతలు అడుగుతున్నారు. ఈ ప్రయత్నం పార్టీ గుర్తింపు రద్దుకు దారి తీస్తుందని వాళ్లకు తెలియట్లేదు. రాజ్యాంగ విరుద్దమైన హామీని(నిర్బంధ ఇంగ్లీష్ హామీ) ఇచ్చినందుకు పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. పార్టీని కాపాడటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. బురద కడిగేవాడిని పట్టుకుని.. బురద చల్లేవాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దిష్టి బొమ్మల్ని కాల్చేసి, వాటికి పట్టినగతే నీకూ పడుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే నేను కేంద్ర బలగాల సాయంకోరాను.

కేకే వేణుగోపాల్ సలహా..
ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి మరో చోటికి తరలించేలా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ రాష్ట్రపతికి తెలుసు. రాజధాని బిల్లులపై 30 రోజల గడువు ముగిసిన దరమిలా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డెఫినెట్ గా రైతులకు న్యాయం జరిగేలానే ఆయన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం నాకుంది. కేంద్ర ప్రభుత్వానికి న్యాయాధికారి అయిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ దేశంలోనే గొప్ప న్యాయకోవిదుడు. అమరావతి బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోయే ముందైనా ఒక్కసారి వేణుగోపాల్ న్యాయ సలహా తీసుకోవాలని రాష్ట్రపతికి సూచించాను. వేణుగోపాల్ లాంటి మేధావి మాటే ఫైనల్ అవుతుందని నేను విశ్వసిస్తున్నాను'' అని ఎంపీ రఘురామ వివరించారు.

రాజధానిపై రాష్ట్రపతికి సిఫార్సు?
ఇటీవలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో.. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో మరోసారి ఆమోదించారు. కానీ గతంలో మాదిరిగానే అది మండలిలోనే నిలిచిపోయింది. సమావేశాలు ముగిసి నెల రోజులు పూర్తయిన దరిమిలా సదరు బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సిఉంది. దీనిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇప్పటికే కేంద్ర హోం శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధాని కార్యాలయంతోనూ టచ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే రాజధాని బిల్లులపై రాష్ట్రపతికి కూడా సిఫార్సు చేశారని ఎంపీ రఘురామ వ్యాఖ్యలతో బయటపడింది. అందుకే అటార్నీ జనరల్ న్యాయసలహా తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కోరానని వైసీపీ రెబల్ ఎంపీ చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications