అతను రెండడుగులు... ఆమె నాలుగడుగులు.. పెద్దలు కుదుర్చిన పెళ్లితో ఒక్కటైన జంట...
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓ పెళ్లి స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. కేవలం రెండు అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న ఓ యువకుడిని నాలుగు అడుగుల ఎత్తున్న ఓ యువతి పెళ్లాడింది. ఎత్తు తక్కువే అయినా అతని మనసు చాలా మంచిదని... అందుకే వివాహం చేసుకున్నానని ఆ యువతి చెబుతోంది.
వివరాల్లోకి వెళ్తే... ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని చింతలపూడి శాంతి నగర్కు చెందిన దేవరపల్లి శ్రీనివాస్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతని ఎత్తు కేవలం రెండు అడుగులు మాత్రమే. చిన్నతనం నుంచి ఎత్తు తక్కువగానే ఉండేవాడు. ఇటీవల అతనికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. అయితే ఎత్తు తక్కువగా ఉన్న కారణంగా సంబంధాలు రాలేదు.
ఇదే క్రమంలో అమలాపురం మండలం సమనస గ్రామం నుంచి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. ఆ యువతి గొల్లపల్లి బలరామ్మూర్తి, లక్ష్మి దంపతుల చిన్న కుమార్తె సత్యదుర్గ. ఆమె ఎత్తు నాలుగు అడుగులు. ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. ఎత్తు విషయంలో అటు అబ్బాయి,ఇటు అమ్మాయి ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అబ్బాయి శ్రీనివాస్ ఎత్తు తనకంటే రెండు అడుగులు తక్కువే అయినప్పటికీ అతని మనసు నచ్చి సత్య దుర్గ పెళ్లికి అంగీకరించింది. బుధవారం(మార్చి 31) క్రైస్తవ మత సంప్రాదాయం ప్రకారం శాంతినగర్లో వీరి పెళ్లి జరిగింది. వివాహ వేడుకకు జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు పితాని బాలకృష్ణ హాజరై వధూవరులను ధీవించారు.
ఇటీవల చిత్తూరు జిల్లా పుత్తూరులో ఓ అంధ యువకుడిని యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అతను అంధుడైనా,ఇద్దరి కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అశోక్,ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వీరమ్మల పెళ్లిని ఓ స్వచ్చంద సంస్థ నిర్వహించింది.ఉపాధ్యాయ కోర్సుకు సంబంధించిన కోచింగ్ సెంటర్లో ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కంటి చూపు లేకపోయినా అతని చురుకుదనం ఆమెకు నచ్చింది. మొదట పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోయినా ఆ తర్వాత సరేనన్నారు.