దూకుడు పెంచిన రఘురామ- మౌనంగా వైసీపీ- కారణాలివేనా ?
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా కత్తులు దూస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా తన దాడిని మరింత తీవ్రతరం చేశారు. ప్రతీ విషయానికీ ప్రభుత్వంతో లింకు పెట్టి మరీ విమర్శలకు దిగుతున్నారు. సొంత నియోజకవర్గాన్ని కూడా వదిలిపెట్టి ఢిల్లీలో ఉంటూనే రాష్ట్రంలో పరిణామాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయినా వైసీపీ మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో రఘురామపై అనర్హత వేటు కోసం ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వైసీపీ తాజా వ్యూహం అంతుబట్టడం లేదు.
Recommended Video

రోజుకో రకంగా వైసీపీని టార్గెట్...
గతంలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఒకట్రెండు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించి విఫలమైన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ప్రతీ రోజూ ప్రతీ విషయంపైనా అదే మార్గం ఎంచుకుంటున్నారు. విపక్షాల కంటే ముందు తానే రంగంలోకి దిగి ప్రభుత్వంపై విమర్శలకు సిద్ధమైపోతున్నారు. కోర్టు తీర్పులైనా, విపక్షాల విమర్శలైనా ఇట్టే ఒడిసిపట్టుకుని వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ పడగానే తాను లైవ్ లోకి వచ్చేసి విమర్శలకు దిగుతున్నారు. దీంతో రఘురామ దూకుడు వెనుక అసలు కారణాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది.

వైసీపీ నేతలకు భయపడి ఢిల్లీలో...
గతంలో తన సొంత నియోజకవర్గం నరసాపురంలో ఎక్కువగా గడిపే రఘురామకృష్ణంరాజు.. వైసీపీతో పోరు మొదలయ్యాక మాత్రం దాదాపుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. గతంలో తనకు భద్రత కల్పించాలని కోరుతూ స్ధానిక పోలీసుల నుంచి ఢిల్లీలోని హోంశాఖ పెద్దల వరకూ అందరినీ కలిసిన రఘురామకృష్ణంరాజు.. దీనిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో తన జాగ్రత్తల్లో తాను ఉంటున్నట్లు అర్ధమవుతోంది. ఏపీలో తనను టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఏ క్షణాన్నైనా దాడులకు దిగవచ్చనే భయాలు ఆయన్ను వెంటాడుతున్నాయి. దీంతో ఢిల్లీలో ఉంటేనే తాను సేఫ్ అని రఘురామరాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ మౌనం ఎందుకు ?
రఘురామకృష్ణంరాజు విమర్శల నేపథ్యంలో అనర్హత వేటు వేయాలని ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన వైసీపీ.. ఆ తర్వాత స్ధానిక నేతలతో రఘురామపై పోలీసు కేసులు పెట్టించింది. దీంతో రఘురామ కాస్తయినా తగ్గుతారని భావించింది. కానీ పరిస్ధితి భిన్నంగా ఉంది. వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రఘురామ మాత్రం వెనక్కి తగ్గడం లేదు సరికదా ఇంకా దూకుడు పెంచారు. ప్రతి రోజూ ప్రభుత్వ విధానాలను, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ రఘురామ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీకి మింగుడు పడటం లేదు. అలాగని రఘురామ వ్యాఖ్యలకు స్పందిస్తే ఇది మరింత ఎక్కువయ్యే ప్రమాదమూ లేకపోలేదు. దీంతో వైసీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.












Click it and Unblock the Notifications