ఏలూరు వింతవ్యాధికి కారణమిదే- తేల్చిన ఎయిమ్స్- కేంద్రబృందం పర్యటన తర్వాత ఫుల్ రిపోర్ట్
ఏలూరులో అంతు చిక్కని వ్యాధితో వందలాది మంది ఆస్పత్రి పాలు కావడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా దృష్టిపెట్టాయి. ఇప్పటికే బాధితుల నుంచి సేకరించిన రక్త, మూత్ర, ఇతర శాంపిల్స్ను ఢిల్లీ ఎయిమ్స్కు పంపారు. వీటిని పరీక్షించిన నిపుణులు ఈ వ్యాధికి కొన్ని ప్రధాన కారణాలను గుర్తించారు. వీటిలో కచ్చితంగా ఏదో ఒకటి అయి ఉండొచ్చని నిర్దారణకు వచ్చారు. ఇవాళ ఏలూరుకు కేంద్ర బృందం రానుంది. రోగులతో మాట్లాడిన తర్వాత, స్ధానిక పరిస్దితులను తెలుసుకున్న తర్వాత సాయంత్రానికి పూర్తి నివేదికను కేంద్రానికి అందిస్తుంది. దీని తర్వాత ఈ వ్యాధికి గల కారణాన్ని కేంద్రమే అధికారికంగా ప్రకటించబోతోంది.
Recommended Video
వింతవ్యాధి కారణాలను గుర్తించిన ఎయిమ్స్..
ఏలూరులో దాదాపు 500 మందికి పైగా బాధితులుగా మారడానికి కారణమైన వింత వ్యాధికి గల కారణాలను తెలుసుకునేందుకు వీరి నుంచి సేకరించిన శాంపిల్స్ను నిన్న మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్లు ఢిల్లీ ఎయిమ్స్కు పంపారు. వీటిని పరీక్షించిన తర్వాత అక్కడి డాక్టర్లు ప్రధానంగా ఓ కారణాన్ని చెబుతున్నారు. తాగునీటిలో సీసం వంటి భారలోహాలు కలవడమే ఇందుకు కారణంగా వారు చెప్తున్నారు. ఎయిమ్స్ డాక్టర్లు ఈ విషయాన్ని నిర్ధారించినట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. రక్తనమూనాల పరీక్షలో ఈ విషయం తేలిందన్నారు. దీన్ని బట్టి ఇతర పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు.
రోగుల శరీరాల్లో సీసం, నికెల్ అవశేషాలు...
ఏలూరు రోగుల నుంచి తమకు అందిన శాంపిల్స్ను పరీక్షించిన ఎయిమ్స్ డాక్టర్లు వీరి శరీరాల్లో సీసం, నికెల్ వంటి భారలోహాల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి తాగునీరు లేదా పాల నుంచి కూడా రోగుల శరీరాల్లో చేరి ఉండొచ్చని ఎయిమ్స్ వైద్యులు భావిస్తున్నారు. దీంతో ఏలూరులో అందుబాటులో ఉన్న నీరు, పాల శాంపిల్స్ను కూడా తమకు పంపాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సాధారణంగా బ్యాటరీల్లో వాడే సీసం ఏదో ఒక మార్గంలో వీరి శరీరాల్లో చేరి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ సీసం కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తున్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
కేంద్రబృందం పర్యటన తర్వాత ఫుల్రిపోర్ట్
ఏలూరు వింత వ్యాధి బాధితుల శరీరాల్లో నుంచి సేకరించిన శాంపిల్స్ ఆధారంగా ఎయిమ్స్ డాక్టర్లు ఓ అంచనాకు రాగా.. ఇప్పుడు ఆ నివేదికను కేంద్ర బృందానికి కూడా అందించనున్నారు. దీని ఆధారంగా కేంద్రబృందం ఇవాళ ఏలూరు పర్యటనలో క్షేత్రస్దాయి వాస్తవాలను నిర్ధారించుకోనుంది. వాటి ఫలితాలతో ఎయిమ్స్ డాక్టర్ల పరిశీలనను పోల్చి చూశాక తుది నివేదికను సాయంత్రానికి కేంద్ర ఆరోగ్యశాఖకు అందించనుంది. ఇందులో వింతవ్యాధి కారణాలను పూర్తి స్ధాయిలో తేల్చి కేంద్రం అధికారికంగా బయటపెట్టనుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్తులో ఏలూరులో చేపట్టాల్సిన చర్యలను కూడా కేంద్రం సూచించబోతోంది. కాబట్టి కేంద్రబృందం పర్యటన అన్ని విధాలుగా కీలకం కానుంది.
మంగళగిరి ఎయిమ్స్ ఏం చెబుతోంది ?
ఏలూరు వింతవ్యాధి బాధితుల శాంపిల్స్ను పరీక్షించిన మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు కూడా ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాగునీటిలో భారలోహాలు కలవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయని వారు చెప్తున్నారు. సీసంతో పాటు ఆల్గానో క్లోరిన్ కలవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని ఎయిమ్స్ సూపరింటెండెంట్ రాకేష్ కక్కర్ చెప్పారు. ఏలూరు చుట్టూ సాగు ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి రైతులు మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కూడా వాడుతున్నారు. ఇవి ఏదో ఒక చోట తాగునీటిలో కలవడం వల్ల కూడా వింతవ్యాధి ప్రబలి ఉండొచ్చని ఆయన తెలిపారు. కొన్నిరోజుల క్రితం రంగుమారిన తాగునీరు వచ్చిందని స్ధానికులు చెప్తుండటంతో దీని తీవ్రత తాజాగా కొంత తగ్గి ఉండొచ్చని ఆయన వెల్లడించారు.