Eluru లో వింతవ్యాధికి తేలని కారణాలు- ఢిల్లీ ఎయిమ్స్కు బాధితుల శాంపిల్స్..
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. ఇప్పటికే దాదాపు 400 మంది ఈ బారిన పడటంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో చేరిన 200 మంది సాధారణ చికిత్సతో కోలుకున్న నేపథ్యంలో మిగతా వారికి కూడా మెరుగైన చికిత్స అందించి సాధ్యమైనంత త్వరగా ఇళ్లకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కోలుకుంటున్న వింతవ్యాధి రోగులను పరామర్శించిన సీఎం జగన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
ఏలూరులో వింతవ్యాధి కారణంగా వందలాది మంది బాధితులుగా మారుతున్న నేపథ్యంలో తాగునీటి శాంపిల్స్ను నగరంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించి విజయవాడకు పంపారు. ఇక్కడ వాటిని పరీక్షించిన డాక్టర్లు ఏమీ లేదని తేల్చారు. గాలి కారణంగా జనం అస్వస్ధతకు గురయ్యారా అన్న కోణంలోనూ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. మొన్న మొదలైన కేసుల పరంపర ఇవాళ్టికీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యల కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. స్ధానికంగా రోగుల నుంచి సేకరించిన రక్తం, మూత్రం, ఇతర శాంపిల్స్ను ప్రభుత్వం ఢిల్లీ ఎయిమ్స్కు పంపింది.
ఏలూరులో వింతవ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్ నుంచి అదనపు వైద్యులను అక్కడికి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే బాధితుల నుంచి సేకరించిన శాంపిల్స్ను ఢిల్లీ ఎయిమ్స్కు పంపినట్లు మంగళగిరి ఎయిమ్స్ అధికారులు ప్రకటించారు. వీటి ఫలితాలు వస్తే కానీ ఏమీ చెప్పలేమని మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఈ వ్యాధికి గల కారణాలు గుర్తించలేకపోయామని, నీటి కాలుష్యం అనేది ఓ కారణం అయి ఉండొచ్చనేది అనుమానం మాత్రమేనని డాక్టర్లు చెప్తున్నారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆస్పత్రికి వచ్చిన 270 మందికి కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటీవ్ వచ్చినట్లు వైద్యులు ధృవీకరించారు. పదేళ్లలోపు చిన్నారులు కొందరు హఠాత్తుగా ఫిట్స్ వచ్చి కుప్పకూలడం లాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.
తొలుత ఒక వీధికే పరిమితమైన వ్యాధి క్రమంగా విస్తరించడం భయాందోళన రేపుతోంది. ఐదురోజుల క్రితమే నగరంలోని దక్షిణపు వీధికి చెందిన కొందరిలో ఫిట్స్ లక్షణాలు కన్పించాయి. వీరంతా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించారు. రోగ నిర్ధారణ కాకపోవడంతో అందరూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటూ అక్కడి వైద్యులు సూచించారు. అప్పటినుంచి ఆదివారం రాత్రి నాటికి 300 మందికి పైగా చికిత్స కోసం ఆస్పత్రి బాట పట్టారు. సాధారణంగా ఈ ప్రాంతంలో నీటి కాలుష్యం కారణంగానే ఏడాది పొడవునా ఎంతో కొంతమంది డయేరియా బారిన పడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడీ వ్యాధి అందరికీ పెద్ద పజిల్గా మారింది. వ్యాధి లక్షణాలు, రోగి తీరుతెన్నులను క్షుణ్నంగా పరిశీలించినా వైద్యనిపుణులు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఒకరిద్దరు మాత్రం మాస్ హిస్టీరియా అని తేల్చేస్తున్నారు. మరికొందరు మెదడు వాపు వ్యాధి అంటున్నారు.