ఏలూరు వింతవ్యాధికి అసలు కారణమిదే- తేల్చిన హై పవర్ కమిటీ- ఇదే ఫైనల్
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నెల రోజుల క్రితం గుర్తించిన వింత వ్యాధికి గల కారణాలను ప్రభుత్వం నియమించిన అత్యున్నత స్ధాయి నిపుణులతో కూడిన హై పవర్ కమిటీ తేల్చేసింది. గతంలో అనుకున్న కారణాలతో పాటు మరికొన్ని కారణాలు కూడా వింత వ్యాధికి కారణమైనట్లు కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. తాజాగా కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఏలూరులో వింతవ్యాధి ప్రబలడానికి కూరగాయలే కారణమయ్యాయని స్పష్టం చేసింది. మార్కెట్కు వచ్చిన వివిధ ప్రాంతాల జనం కొన్న కూరగాయల నుంచి ఈ వ్యాధి ఆయా ప్రాంతాల్లో బయటపడిందని వెల్లడించింది.
Recommended Video

ఏలూరును కుదిపేసిన అంతు చిక్కని వ్యాధి
ఏలూరులో గత డిసెంబర్ 4నుంచి ఒక్కసారిగా వందల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలయ్యారు. ఆకస్మికంగా మూర్చపోవడం, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం వంటి కారణాలతో వందల సంఖ్యలో జనం ఆస్పత్రులకు తరలిరావడంతో ప్రభుత్వం, అధికారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ వ్యాధి లక్షణాలు గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో ఉండటంతో ఏం జరిగిందో తెలియక ఢిల్లీ ఎయిమ్స్కు శాంపిల్స్ పంపి సాయం కోరారు. చివరికి ఈ వ్యాధి ఇద్దరిని బలి తీసుకుంది కూడా. దీంతో అంతు చిక్కని వింత వ్యాధికి గల కారణాలను కనుగొనేందుకు ఎయిమ్స్తో పాటు ప్రఖ్యాత ల్యాబ్లు రంగంలోకి దిగాయి. నీటి కాలుష్యం దారుణంగా ఉందని ప్రాథమికంగా తేల్చాయి.

హై పవర్ కమిటీ పరిశోధన
ఏలూరులో బయటపడిన వింతవ్యాధికి గల కారణాలపై ఎయిమ్స్పాటు ప్రముఖ పరిశోధనా సంస్ధలన్నీ భిన్నవాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అత్యున్నత స్దాయి నిపుణులతో ఓ జంబో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు 40 మందికి పైగా అధికారులు, నిపుణులు, డాక్టర్లతో కూడిన ఈ కమిటీ కొన్ని రోజులుగా విస్తృత స్ధాయిలో ఏలూరులో పర్యటించడమే కాకుండా, అక్కడ సేకరించిన శాంపిల్స్ను ప్రముఖ ల్యాబ్ల్లో పరీక్షలు చేయించి చివరకు అంతుచిక్కని వ్యాధికి గల కారణాలను తేల్చింది. ప్రభుత్వానికి కమిటీ తాజాగా సమర్పించిన నివేదికలో ప్రస్తావించిన పలు అంశాలు షాకింగ్గా కూడా ఉన్నాయి.

కూరగాయల వల్లే ఏలూరు వింతవ్యాధి
ఏలూరులో వింతవ్యాధి ప్రబలడానికి ప్రధానంగా విషతుల్యంగా మారిన కూరగాయలే కారణమని హై పవర్ కమిటీ నిర్దారణకు వచ్చింది. ఏలూరు మార్కెట్కు వచ్చిన కూరగాయలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం కొనుగోలు చేసి తీసుకెళ్లడం వల్లే ఆయా ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత కనిపించిందని కమిటీ అభిప్రాయపడింది. గతంలో ఎయిమ్స్తో పాటు వివిధ పరిశోదనా సంస్ధలు చెప్పినట్లుగానే ఆర్గానో క్లోరిన్ కూరగాయల్లో ఉండటం వల్లే ప్రజలు భారీ స్ధాయిలో ఈ వింత వ్యాధి బారిన పడినట్లు కమిటీ కనుగొంది. అయితే కూరగాయలతో పాటు నీరు, పాలు,, పండ్లలోనూ చేరిన ఆర్గానో క్లోరినే ఈ వింత వ్యాధికి కారణమైనట్లు కమిటీ తన నివేదికలో తెలిపింది.

మరో చోట రాకుడా చర్యలు సూచించిన కమిటీ
ఏలూరులో బయటపడిన వింత వ్యాధి తిరిగి రాకుండా, అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా తలెత్తకుండా హై పవర్ కమిటీ ప్రభుత్వానికి కొన్ని చర్యలు సూచించింది. ఇందులో ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కొంతకాలం పాటు నీటి శాంపిల్స్ టెస్ట్ చేయడంతో పాటు కార్లు కడిగిన మురికి నీరు ఏలూరు కాల్వలో కలవకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. నిషేధిత రసాయనాలు క్రిమి సంహారక మందులతో కలిసి పొలాల్లోకి చేరకుండా వ్యవసాయశాఖ చర్యలు చేపట్టాలని కమిటీ సూచించింది. తిరుపతి, గుంటూరు, విశాఖల్లో రాష్ట్రస్ధాయి ల్యాబ్లు ఏర్పాటు చేసి ఆహార పదార్ధాల్లో ఆర్గానో క్లోరైడ్లు, ఆర్గానో ఫాస్ఫైట్లు ఉంటున్నాయేమో పరీక్షించాలని కోరింది.












Click it and Unblock the Notifications