పోయిన చోటే వెదుక్కుంటోన్న పవన్ కల్యాణ్: మళ్లీ రిస్క్ తీసుకున్నట్టేనా?
ఏలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన దూకుడు పెంచారు. ఆదివారం నాడు నిర్వహించే జనసేన-జనవాణి కార్యక్రమం పేరుతో ప్రజలకు చేరువ అవుతున్నారు. ఇవ్వాళ మూడో విడత జనవాణి కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించారు. దీనికి హాజరయ్యారు పవన్ కల్యాణ్. బాధితులతో మాట్లాడారు. వారితో మమేకం అయ్యారు. పలు హామీలు ఇచ్చారు. భీమవరంలో ఏర్పాటైన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని సందర్శించారు. నివాళి అర్పించారు.

భీమవరం ప్రత్యేకత అదే..
భీమవరానికి ఉన్న ప్రత్యేకత తెలిసిందే. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. విశాఖపట్నం గాజువాక నుంచీ బరిలోకి దిగారు. ఈ రెండు చోట్ల కూడా ఆయన ఓటమిపాలయ్యారు. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్, గాజువాకలో తిప్పల నాగిరెడ్డి చేతిలో పరాజయాన్ని చవి చూశారు.

మళ్లీ అక్కడి నుంచే..
భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ చేతిలో 8,357 ఓట్ల తేడాతో ఓడిపోయారు పవన్ కల్యాణ్. ఏరికోరి ఎంచుకున్న నియోజకవర్గమే అయినప్పటికీ.. ఆయనకు ఏ మాత్రం కలిసిరాలేదు అప్పట్లో. అలాంటి భీమవరం నియోజకవర్గం నుంచే పవన్ కల్యాణ్ మరోసారి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తోన్నాయి. ఈ వార్తలకు మరింత బలాన్ని కలిగించేలా ఆయన ఇవ్వాళ భీమవరంలో మకాం వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పవన్ మార్క్..
ఈ సారి మాత్రం ముందు నుంచే గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకుంటోన్నట్టే కనిపిస్తోంది. జనసేన-జనవాణి పేరుతో ఆయన భీమవరంవాసులను కలుసుకున్నారు. వారి బాధలను ఆలకించారు. వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామనీ హామీ ఇచ్చారు. జనవాణిలో తనదైన శైలిలో ప్రసంగించారు. దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి కష్టాలను విన్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి పథకాలు అందట్లేదంటూ బాధితులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.

అల్లూరికి నివాళి..
అనంతరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సందర్శించారు. మన్యం వీరుడికి నివాళి అర్పించారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 30 అడుగుల ఎత్తయిన ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, మంత్రి రోజా, మెగాస్టార్ చిరంజీవి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్కు ఆహ్వానం అందకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications