ఏలూరు జిల్లాలో విషాదం; పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి; మరో ముగ్గురికి గాయాలు
ఏలూరు: ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉపాధి కోసం కూలి పని చేసుకోవడానికి వెళ్ళిన వారిపై పిడుగు పడి నలుగురు కూలీలు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. నలుగురు కూలీలు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలులో పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందారు. బోగోలు లో జామాయిల్ తోట నరకడానికి దాదాపు 30 మంది కూలీలు పని కోసం వెళ్లారు. చెట్లు నరుకుతున్న ఈ క్రమంలో వారి పై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో నలుగురు కూలీల అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చెట్లను తొలగిస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన వారు కొండబాబు (35), ధర్మరాజు (20), రాజు (25), వేణు (18) గా గుర్తించారు. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూలీలు తోట పనులకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన గుడారాల కింద నివసిస్తున్నారు. తమ పనిచేసే నలుగురు మృతి చెందడంతో, మిగతా కూలీలు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదిలావుంటే ఇటీవల మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోనూ పిడుగుపాటుకు పలువురు మరణించారు. వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని విదిశా, సత్నా, గుణ జిల్లాలలో తొమ్మిది మంది పిడుగుపడి మరణించారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో పిడుగు పడి ఇంట్లో ఉన్న మహిళ తో పాటు ఆమె కుమారుడు మరణించారు. దాదాపు వారం రోజుల క్రితం చోటు చేసుకున్న పిడుగు పాట్ల దెబ్బ కు మొత్తం పది మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోనూ జోగులాంబ జిల్లాలో వేరు వేరు చోట్ల పిడుగు పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇటీవల ఈ తరహా మరణాలు ఎక్కువగా జరుగుతున్న నేపధ్యంలో వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద ఉండొద్దని సూచిస్తున్నారు.