health tips: అర్దరాత్రి నిద్ర లేస్తున్నారా? తరచూ నిద్రాభంగం జరిగితే నిర్లక్ష్యం చెయ్యకండి.. ఎందుకంటే!!
నిద్ర.. మనిషి ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పడానికి అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన జీవనవిధానంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోయిన వారు ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అలా ఎప్పుడు పడితేఅప్పుడు నిద్ర పోవటం కూడా మంచిది కాదని చెప్తున్నారు. పడుకున్న తర్వాత మధ్యలో ఎటువంటి నిద్ర బంధాలు లేకుండా నిద్ర పోగలగడం ఆరోగ్యవంతుల లక్షణమని చెబుతున్నారు. అయితే మన జీవనశైలి, పరుగుల ప్రపంచంలో పని ఒత్తిడి కారణంగా చాలామంది నిద్రకు దూరమవుతున్నారు.
ప్రశాంతంగా నిద్ర పోలేకపోతున్నారా? తరచూ మెలకువ వస్తే జాగ్రత్త
సుఖంగా నిద్ర పోయి ఎంత కాలమైందో అని చెప్పే వాళ్ళు ప్రస్తుత సమాజంలో సగానికి పైగా ఉన్నారు. సుఖంగా నిద్ర పోలేకపోతున్న వారంతా వివిధ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు అన్నది నమ్మవలసిన సత్యం. ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం, కూర్చుని చేసే ఉద్యోగాలు వల్ల విపరీతమైన మానసిక ఒత్తిడి పెరగడం వంటి అనేక కారణాలు నిద్ర భంగానికి కారణంగా మారుతున్నాయి. రాత్రివేళ పడుకున్న తర్వాత తరచూ అర్ధరాత్రిలో మెలకువ రావడం సంభవిస్తే ఖచ్చితంగా వైద్యనిపుణుడిని సంప్రదించాలని చెబుతున్నారు.
తరచూ నిద్రా భంగాన్ని అశ్రద్ధ చెయ్యకండి
ఎందుకంటే మన శరీరంలో ఉన్న అనారోగ్య కారణంగానే అర్ధరాత్రి మనకు తెలియకుండానే మెలకువ వస్తుంది అని, దానిని గుర్తించడం కోసం తొలిదశలోనే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. ప్రతి రోజూ అర్ధరాత్రి మెలకువ వచ్చి, నిద్రపట్టక పోతున్నా మాకేం కాదులే అని భావించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా ప్రతిరోజూ జరిగే నిద్రాభంగాన్ని అశ్రద్ధ చేయకుండా వైద్యులకు చూపించుకోవాలి అని సూచిస్తున్నారు. అది క్రమంగా ఇన్సోమ్నియాకు దారి తీస్తుందని అంటున్నారు. ఒక్కో సారి నిర్లక్ష్యం ప్రాణం మీదకు తీసుకురావచ్చని హెచ్చరిస్తున్నారు.
నిద్ర విషయంలో జాగ్రత్తలు అవసరం
ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో కూడా తెలీకుండా రాత్రి సమయంలో ఆకస్మికంగా చనిపోతున్న వారు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. అందులో యుక్త వయసులో ఉన్న యువకులు కూడా ఉన్నారు. అందుకే నిద్ర విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఎక్కువగా నిద్ర పట్టక నిద్ర భంగానికి గురవుతున్న వారు తాము నిద్ర పోవడానికి వీలుగా బెడ్రూంను మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. బెడ్ రూంలో సాధ్యమైనంత తక్కువ లైటింగ్ ఉంటే త్వరగా నిద్ర పడుతుందని చెబుతున్నారు. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కళ్లు మూసుకుని, సరైన భంగిమలో నిద్రపోవడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
పగటిపూట నిద్ర మానుకుంటే మంచిదని వైద్యుల సలహా
ఇక రాత్రి సమయాల్లో సరిగా నిద్ర పట్టని వారు పగటిపూట పడుకుందాం లే అనుకుంటే తప్పంటున్నారు. పగలు రోజూ మూడు, నాలుగు గంటల పాటు నిద్ర పోవడం మంచిది కాదని చెబుతున్నారు. పగటిపూటనిద్ర మానుకుంటే రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నిద్రపోయే ముందు ఇంట్లోని సమస్యల గురించి పదేపదే ఆలోచించడం కూడా నిద్ర భంగానికి కారణమవుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆరోగ్యవంతులు సుఖంగా నిద్ర పోగలుగుతారని, అనారోగ్యంతో ఉన్న వారే సరిగా నిద్రపో లేక ఇబ్బంది పడతారని చెబుతున్న వైద్యులు, నిద్ర పట్టని వారు తమ శారీరక అనారోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.