రాజధానిగా అమరావతి అభివృద్ధిపై తేల్చేసిన మంత్రి రోజా-
గుంటూరు: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ మూడు రాజధానుల చుట్టూ తిరుగుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే మంజూరు చేయడంతో- రాష్ట్ర ప్రభుత్వం కూడా జాప్యం చేయకుండా మూడు రాజధానుల ఏర్పాటు దిశగా తక్షణ చర్యలకు దిగుతోంది. దీనిపై పలు సందర్భాల్లో పలువురు మంత్రులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు.

అమరావతి అభివృద్ధిపై..
ఈ పరిస్థితుల మధ్య అమరావతి అభివృద్ధి ఏమౌతుందనే ఆందోళన ఆ ప్రాంతానికి చెందిన రైతులు, తెలుగుదేశం, భారతీయ జనత పార్టీ, జనసేనల్లో వ్యక్తమౌతోంది. అమరావతి కోసం 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలంటూ ఈ మూడు పార్టీలు డిమాండ్ చేస్తూ వస్తోన్నాయి. ఉద్యమాలను సైతం చేపట్టాయి. తాజాగా వారు చేపట్టిన అమరావతి టు అరసవల్లి పాదయాత్ర అర్ధాంతరంగా ఆగిన విషయం తెలిసిందే.

పానకాల స్వామివారి సేవలో..
అమరావతి అభివృద్ధిపై తాజాగా పర్యాటక, సాంస్కృతికవ్యవహారాల శాఖ మంత్రి ఆర్ కే రోజా మాట్లాడారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆమె ఇవ్వాళ మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు.

పర్యాటకాభివృద్ధిపై..
అనంతరం రోజా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న స్వదేశీ దర్శన్, పిలిగ్రిమేజ్ రెజునవేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగమెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీమ్ అమలు తీరును ప్రస్తావించారు. స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద కడప జిల్లా గండికోట, విశాఖపట్నం జిల్లా లంబసింగి, ప్రసాద్ పథకంలో సింహాచలం, అన్నవరం పేర్లను ప్రతిపాదించామని తెలిపారు.

భవానీ ఐలండ్ పై..
భవానీ ఐలండ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, పొరుగు రాష్ట్రాల పర్యాటకులు ఈ ద్వీపాన్ని సందర్శించేలా ఏర్పాట్లు చేస్తోన్నామని వివరించారు. ఇతర ఐలాండ్స్ కు చెందిన జాబితాలను కూడా సిద్ధం చేస్తోన్నామని, త్వరలోనే వాటి అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లబోతోన్నామని పేర్కొన్నారు. మాల్దీవుల తరహాలో ఐలండ్స్ను అభివృద్ధి చేస్తామని అన్నారు.

అమరావతిపై..
రాజధాని అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తోన్నామని రోజా అన్నారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచ బుద్ధిస్ట్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఆ దిశగా ఇప్పటికే శాఖాపరమైన చర్యలను తీసుకున్నామని వివరించారు. ఎప్పటి నుంచో అమరావతి ప్రాంతం బౌద్ధిజం కేంద్రంగా విరాజిల్లుతోందని చెప్పారు. టూరిజం ప్యాకేజీ కింద మంగళగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఎన్ని మంచి పనులు చేస్తోన్న టీడీపీ నాయకులు విమర్శిస్తూనే ఉంటారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications