BJP: పౌరసత్వ చట్టం పర్వంలో మరో పార్శ్యం: తిరంగా యాత్రకు కమలనాథుల శ్రీకారం.. !
గుంటూరు: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, హింసాత్మక పరిస్థితులు చెలరేగడాన్ని ఇన్ని రోజులూ చూస్తూ వచ్చాం. ఇక- ఈ చట్టానికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహించడాన్ని చూడబోతున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ తరహా ప్రదర్శనలకు తెర తీసింది. దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను నిర్వహిస్తోంది.
1987కు ముందు..: పౌరసత్వ సవరణపై చట్టంపై కేంద్రం స్పష్టత
సందేహాలను తొలగించేలా..
ఇందులో భాగంగా- ఏపీలో ఈ యాత్రను బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం గుంటూరులో ఆరంభించారు. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడానికి, ముఖ్యంగా మైనారిటీల్లో వ్యక్తమౌతోన్న భయాందోళనలను తొలగించడానికి బీజేపీ.. తిరంగా యాత్రకు శ్రీకారం చుట్టింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రూపంలో దీన్ని నిర్వహిస్తున్నారు బీజేపీ నాయకులు.
తిరంగా యాత్రలో భారీగా..
ఈ ఉదయం అమరావతి శంకుస్థాపన ప్రదేశం వద్ద మౌన ప్రదర్శనను నిర్వహించారు కన్నా లక్ష్మీనారాయణ. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన నేరుగా గుంటూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తిరంగా యాత్రకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను పరిశీలించారు. దీనిపై స్థానిక నాయకులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం- తిరంగా యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో వంద మీటర్లకు పైగా పొడవు ఉన్న జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.
ప్రజల్లో అపోహలు రేపుతోన్న ప్రతిపక్షం..
తిరంగా యాత్ర సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ప్రసంగించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు వంటి కార్యక్రమాలను అడ్డుగా పెట్టుకుని ప్రజలను నిలువుగా చీల్చే కుట్రకు ప్రతిపక్ష పార్టీలు తెర తీశాయని విమర్శించారు. ప్రజల్లో లేనిపోని అపోహలను రేపుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన పార్లమెంట్ భవనం సాక్షిగా రూపుదిద్దుకున్న ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రంపైనా ఉందని చెప్పారు.
ముస్లింలల్లో అనుమానాలను నివృత్తి చేస్తాం..
పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లింలల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సహకారంతో అన్ని కళాశాలలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో సెమినార్లను నిర్వహిస్తామని తెలిపారు. ఈ చట్టంలో పొందు పరిచిన ప్రతి అంశంపైనా వివరిస్తామని అన్నారు.