చంపేస్తారా?: జగన్ సర్కారుపై చంద్రబాబు నిప్పులు, ఏమన్నారంటే.?
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరులో మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చంపేస్తారా??
సీఎం జగన్ చెబితే తమను చంపేస్తారా? అంటూ పోలీసులను నిలదీశారు చంద్రబాబు. టీడీపీ చట్ట వ్యతిరేక పార్టీ ఏమీ కాదని, తమ పట్ల పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి పది మందిని చంపారని, వందలాది మందిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.

రక్షణ కల్పించకుండా పోటీ కార్యక్రమాలా?
వైసీపీ దాడుల బాధితులు స్వగ్రామంలో నివసించే హక్కు కోసమే తాము ‘చలో ఆత్మకూరు'కు పిలుపునిచ్చినట్లు చంద్రబాబు వివరించారు. తమ పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలు, రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో అణచివేశామని ఆయన తెలిపారు.
వైసీపీ బాధితుల శిబిరం పెట్టి 8 రోజులైనా మీకు కనిపించలేదా? అని చంద్రబాబు ఏపీ సీఎంను ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి బాధితుల్ని ఎలా తీసుకెళ్తారని, వారికి ఏ విధంగా రక్షణ కల్పిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. దాడులకు సమాధానం చెప్పమంటే పోటీ మీరు కూడా కార్యక్రమాలు చేపడతారా? అని వైసీపీ నేతలను ప్రశ్నించారు.

మీది రాక్షసానందం..
మీ బాబాయ్ని చంపినవాళ్లను ఇంత వరకు ఎందుకు పట్టుకోలేదని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. తాము బాధితులకు న్యాయం కోసం చలో ఆత్మకూరు చేపడితే.. అందుకు విరుద్ధంగా వైసీపీ కూడా చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇది పైశాచిక, రాక్షస ఆనందం తప్ప మరొకటి కాదని మండిపడ్డారు.

మాది బాధితుల గోడు.. మీది ఊరేగింపు..
రాష్ట్రంలో బాధితుల గోడు వినే నాథుడే లేడని, సీమలో చీని చెట్లు నరికి టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారా? అని ప్రశ్నించారు. రాజానగరం ఎమ్మెల్యే కబ్జాను అడ్డుకున్నందుకు దాడి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత హోంమంత్రిపై లేదా? అని ప్రశ్నించారు చంద్రబాబు. బీజేపీ నాయకులు వస్తుంటే 144 సెక్షన్ పెడతారా? వైసీపీ నాయకులు 144 సెక్షన్ వర్తించదా? అని నిలదీశారు. ‘సేవ్ పల్నాడు' పేరుతో సీఎం, హోంమంత్రి ఫొటోలు పెడతారా? అని ప్రశ్నించారు. మీది ఊరేగింపు అయితే.. మాది బాధితుల గోడు అని వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications