Guntur Murder : చలించిపోయిన జగన్-మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి-ఆ ఫోన్ అన్లాక్ చేస్తే...
గుంటూరులో బీటెక్ విద్యార్థిని హత్య సంచలనం రేపుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు,నడిరోడ్డుపై యువతి హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జీజీహెచ్లో మృతురాలు రమ్య మృతదేహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు.రమ్య హత్య ఘటన తెలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారని.. ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారని వెల్లడించారు.

హోంమంత్రి ఏమన్నారు...
హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ... ఒక మహిళను చంపే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలన్నారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే హత్యకు సంబంధించి పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారని... సాధ్యమైనంత త్వరగా పోలీసులు నిందితుడిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పారు. విచారణ త్వరగా పూర్తి చేసి హంతకుడికి శిక్షపడేలా చూస్తామన్నారు. రమ్య సెల్ఫోన్ లాక్ చేసి ఉందని... దాన్ని ఓపెన్ చేస్తే హత్యకు సంబంధించి మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందన్నారు. ఫోన్ను అన్లాక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తికి కచ్చితంగా కఠిన శిక్ష పడుతుందన్నారు.

మృతురాలి కుటుంబ సభ్యులు ఏమన్నారు...
మృతురాలి తండ్రి,సోదరుడు ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తల్లి రమ్య మృతదేహంపై పడి గుండెలవిసేలా రోధించారు. మృతురాలి తండ్రి మాట్లాడుతూ... హత్య జరిగిన సమయంలో తాను వేరే గ్రామంలో ఉన్నట్లు చెప్పారు. ఎందుకు జరిగిందో,ఎలా జరిగిందో తనకేమీ తెలియదన్నారు. తమకు ఎవరి పైనా అనుమానం లేదన్నారు. సెయింట్ మేరీస్ కాలేజీలో తన కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతోందని చెప్పారు. మృతురాలి సోదరుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఎవరు హత్య చేశారనేది తమకు తెలియదన్నారు.అంతకుముందు,గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతురాలి సోదరిని వెంట తీసుకెళ్లి హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు...
టీడీపీ నేత పిల్లి మాణిక్యం ఈ ఘటనపై మాట్లాడుతూ... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మొదటి బహుమతి దిశ చట్ట శకటానికి ఇచ్చారని...ఆ చట్టం అమలులో ఉన్నా ఇలాంటి ఘటనలు జరగడమేంటని ప్రశ్నించారు. అసలు ఇంతవరకూ ఆ చట్టానికి పార్లమెంటులో ఆమోదం లభించలేదన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన పోలీస్ స్టేషన్లకు రంగులు వేయడం మినహా జగన్ మోహన్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు.

వాసిరెడ్డి పద్మ రియాక్షన్...
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ జీజీహెచ్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాత... అందరూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉన్న సమయంలో గుంటూరు నడిరోడ్డులో పట్టపగలు జరిగిన ఈ ఘటన ఒక మాయని మచ్చ అన్నారు. చాలా ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ... ఓ విద్యార్థిని ఇంత దారుణంగా హత్యకు గురవడం... సమాజం ఎక్కడికి వెళ్తుందోననే ఆందోళన కలిగిస్తోందన్నారు. మృతురాలు రమ్య కుటుంబానికి పేద కుటుంబమని చెప్పారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారని చెప్పారు. పరిచయస్తులే హత్య చేశారని ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారని... నిందితులకు కఠిన శిక్ష విధించాలని అన్నారు.

పరామయకుంటలో పట్టపగలు హత్య...
గుంటూరులోని కాకాణి రోడ్డు పరామయకుంటలో ఆదివారం(ఆగస్టు 15) ఉదయం 10గంటల సమయంలో నల్లపు రమ్య హత్యకు గురైంది.ఇంటి నుంచి సమీపంలోని ఓ షాపుకు వెళ్లిన సమయంలో... ఓ యువకుడు అక్కడికి వచ్చి ఆమెతో గొడవపడినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా కత్తితో అతను దాడి చేసి పరారయ్యాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో రమ్య అక్కడికక్కడే కుప్పకూలింది. స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. రమ్య శరీరంపై ఆరు కత్తిపోట్లను గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

నెల్లూరులోనూ ఇలాంటి ఘటనే...
రెండు నెలల క్రితం నెల్లూరు జిల్లా గూడూరులోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తేజస్విని అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఓ ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైంది. గూడూరులో సుధాకర్-సరిత దంపతుల కుమార్తె తేజస్విని ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. ఇదే క్రమంలో సుధాకర్ సహచర ఉద్యోగి చెంచు కృష్ణయ్య కుమారుడు వెంకటేశ్... తేజస్వినితో పరిచయం పెంచుకున్నాడు. కొద్దిరోజులకు అది కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అయితే ఏడాది కాలంగా వెంకటేశ్ తన ప్రవర్తనతో విసిగిస్తుండటంతో తేజస్విని అతన్ని దూరం పెట్టింది.వెంకటేశ్ను అతని తండ్రి చెంచు కృష్ణయ్య బెంగళూరు పంపించడంతో అక్కడే ఉంటున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో అతను తిరిగి గూడూరు వచ్చాడు. అప్పటినుంచి మళ్లీ తేజస్విని వెంటపడటం మొదలుపెట్టాడు. తరచూ ఫోన్లు చేసి ప్రేమ పేరుతో ఆమెను వేధించేవాడు. అతని వేధింపులు భరించలేక తేజస్విని తన ఫోన్ నంబర్ కూడా మార్చేసింది. దీంతో వెంకటేశ్ ఆమెపై మరింత కక్ష పెంచుకుని రగిలిపోయాడు. ఆమెపై దాడి చేసేందుకు అదను కోసం ఎదురుచూడసాగాడు.

తేజస్విని దారుణ హత్య...
సుధాకర్-సరిత స్కూల్కు వెళ్తుంటారు కాబట్టి... ఆ తర్వాత ఇంట్లో తేజస్విని,ఆమె తమ్ముడు మాత్రమే ఉంటారన్న విషయం తెలుసుకున్నాడు. గురువారం (జులై 1) ఉదయం సుధాకర్,సరిత స్కూల్కు వెళ్లిన కొద్దిసేపటికి.. వెంకటేశ్,తన స్నేహితుడితో కలిసి వారి అపార్ట్మెంట్ వద్దకు వెళ్లాడు. మొదట స్నేహితుడిని తేజస్విని ఫ్లాట్ వద్దకు పంపించి ఆమె ఫోన్ నంబర్ తెలుసుకుని రమ్మన్నాడు. అతను తేజస్విని ఫ్లాట్ వద్దకు వెళ్లి తలుపు కొట్టగా.. ఆమె సోదరుడు తలుపు తీశాడు. ఆమె ఫోన్ నంబర్ ఇవ్వాలని అతన్ని కోరడంతో అందుకు అతను నిరాకరించాడు. ఆ వెంటనే తండ్రికి ఫోన్ చేశాడు. తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ తేజస్విని సోదరుడు కిందకు వెళ్లడంతో... అదే అదనుగా వెంకటేశ్ అతని కంట పడకుండా గబాగబా పైకి వెళ్లాడు. తేజస్విని ఫ్లాట్లోకి చొరబడి ఆమె ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు మూశాడు. ఆపై కత్తితో ఆమె గొంతులో పొడిచాడు. ఆ తర్వాత చున్నీని మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపాడు. ఆపై అదే గదిలో చున్నీతో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సుధాకర్ పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. తేజస్విని,వెంకటేశ్ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తేజస్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో విజయవాడ,విశాఖపట్నంలలోనూ ఇంజనీరింగ్ విద్యార్థినులపై ఇలాంటి దాడులు,హత్యలు జరిగాయి.
-
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్లో సందడి !! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications