వైసీపీకి సుచరిత గుడ్బై: స్పీకర్ ఫార్మట్లో రాజీనామా: ఇంటి వద్ద హైడ్రామా: ఆ జిల్లాలు భగ్గు
గుంటూరు: రాష్ట్రంలో చోటు చేసుకున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వ్యవహారం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలను సృష్టిస్తోంది. పదవులను కోల్పోయిన నాయకులు రాజీనామా బాట పట్టారు. కేబినెట్ బెర్త్పై ఆశలు పెట్టుకుని, అవి అందకపోవడం వల్ల నిరాశకు గురైన ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రత్యేకించి- గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దీని తీవ్రత అధికంగా ఉంటోంది.

మేకతోటి రాజీనామా..
తనను మంత్రివర్గం నుంచి తప్పించడాన్ని నిరసిస్తూ మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి గుడ్బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు అందజేశారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె వెల్లడించారు. స్పీకర్ ఫార్మట్లో రాజీనామా చేశారని, బుజ్జగింపులకు లొంగదలచుకోలేదని తేల్చి చెప్పారు. మంత్రివర్గం నుంచి తప్పించడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

సుచరిత ఇంటికి..
తనను మంత్రి పదవి నుంచి తప్పించడం పట్ల సుచరిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్న తరువాత పార్టీ నాయకత్వం బుజ్జగింపు చర్యలు మొదలు పెట్టింది. ఈ బాధ్యతను మోపిదేవి వెంకటరమణకు అప్పగించింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని ఆమె నివాసానికి వెళ్లారు. మంత్రి పదవి నుంచి తొలగించడానికి గల కారణాలను వివరించారు. ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఎవరికీ ఇవ్వని ప్రాధాన్యతను ఇచ్చారని అనునయించారు.

ఇంటి వద్ద హైడ్రామా..
ఈ సందర్భంగా సుచరిత ఇంటివద్ద హైడ్రామా చోటు చేసుకుంది. మోపిదేవి వచ్చిన విషయం తెలుసుకుని సుచరిత అనుచరులు పెద్ద ఎత్తున ఆమె నివాసానికి చేరుకున్నారు. సుచరితను కేబినెట్లో కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన తమ నాయకురాలిని మోసం చేశారంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. మోపిదేవి వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వారిని కొనసాగిస్తూ..
దళిత సామాజిక వర్గానికే చెందిన తానేటి వనిత, కే నారాయణస్వామి, పినిపె విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ను కొనసాగిస్తూ తనను మాత్రమే తొలగించడం వల్లే సుచరిత అసంతృప్తి ఉన్నట్లు చెబుతున్నారు. ఆమెను తప్పించడానికి సామాజిక వర్గాల సమీకరణ మాత్రమే కాకుండా.. అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలను సుచరిత ఆశించిన స్థాయిలో నిర్వహించకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. అటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. రాజీనామాకు సిద్ధపడ్డారు.

ప్రకాశం జిల్లాలో వారిద్దరి అలక..
ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఒంగోలు శాసన సభ్యుడు, విద్యుత్ శాఖ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఆయనను బుజ్జగించడానికి పార్టీ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించారు. గిద్దలూరు శాసన సభ్యుడు అన్నా రాంబాబు సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. కేబినెట్లో చోటు దక్కుతుందంటూ ఆశపెట్టారని, తన సామాజిక వర్గానికెవరికీ చోటు కల్పించలేదని మండిపడుతున్నారాయన.












Click it and Unblock the Notifications