Target YCP:మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ మతం కార్డు:ఈ సారి అక్కడ శిలువ అంటూ..!
గుంటూరు: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోన్న వేళ.. భారతీయ జనతా పార్టీ నాయకులు మరోసారి హిందూమతంపై దాడి అస్త్రాన్ని బయటికి తీసినట్టు కనిపిస్తోంది. ఇదివరకు విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రం, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యస్వామి వారి విగ్రహాల ధ్వంసం, అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథం మంటల బారిన పడిన ఉదంతాలపై పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించిన బీజేపీ మళ్లీ అలాంటి ప్రయత్నానికే తెర తీసిందనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.
ఎడ్లపాడులో నరసింహుడి గుట్టపై
గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సీతమ్మ తల్లి పాదముద్రలు, నరసింహస్వామి వారి విగ్రహం ఉన్న ఓ గుట్టను క్రైస్తవ మిషనరీ మాఫియా అక్రమంగా ఆక్రమించుకుందంటూ బీజేపీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆ గుట్టపై అక్రమంగా శిలువను స్థాపించారని విమర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో హిందూమతానికి, దేవాలయాలు, విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
దాడులు కొనసాగింపు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. సీతమ్మ తల్లి పాదముద్రలు ఉన్న చోట, నరసింహస్వామి విగ్రహానికి భక్తులు నిత్యం పూజలు జరిపే ప్రాంతంలో ఎత్తయిన శిలువను క్రైస్తవ మిషనరీ స్థాపించిందని, శాశ్వత కట్టడాలను నిర్మించిందని మండిపడ్డారు. దీన్ని నియంత్రించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని ఆయన ప్రశ్నించారు.
సోము వీర్రాజు.. సునీల్ దేవ్ధర్..సాదినేని యామిని రీట్వీట్..
విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ను బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ధర్, సీనియర్ నాయకురాలు సాదినేని యామని రీట్వీట్ చేశారు. ఇదివరకు రామతీర్థం ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి, రాజమండ్రి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ధ్వంసం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో మూడు వెండి సింహాల విగ్రహాలు మాయం కావడం వంటి ఘటనల సందర్భంగా యామిని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ పాలనలో హిందువులు జీవించే పరిస్థితి లేదని, ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంస ఘటనలను చూస్తూ ఉండలేని వాతావరణం నెలకొందంటూ అప్పట్లో ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆయా ఘటనలపై
బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన ఆయా సంఘటనలన్నింటిపైనా జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించిన విషయం తెలిసిందే. అంతర్వేది లక్ష్మీనరసింహా స్వామి రథం మంటల బారిన పడిన ఘటనపై దర్యాప్తు నిర్వహించే బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఆ ఆలయానికి 93 లక్షల రూపాయల వ్యయంతో కొత్త రథాన్ని నిర్మించి ఇచ్చింది. కొద్దిరోజుల కిందటే వైఎస్ జగన్.. ఆ రథాన్ని ప్రారంభించారు. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం విధ్వంసానికి పాల్పడింది ఆలయ పూజారేనని, టీడీపీ నాయకులు కొందరు ఆయనకు డబ్బులిచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు.



Click it and Unblock the Notifications































