ఏ2గా: వైసీపీ మహిళా నేతపై ఎఫ్ఐఆర్: సీఎంకు చెప్పి ఉద్యోగాలు తొలగిస్తానంటూ బెదిరింపు
గుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏపీ వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ల రేవతి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. భారత శిక్ష్మాస్మృతిలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ వద్ద వీరంగం సృష్టించడం, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని కొట్టడం, వారిపై దౌర్జన్యానికి పాల్పడటం వంటి చర్యలకు పాల్పడినందు వల్ల ఆమెపై గుంటూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వైసీపీ మహిళా నేత వీరంగంపై జగన్ సీరియస్: కలవాలంటూ ఆదేశం: సీఎంఓ నుంచి ఫోన్కాల్
దేవళ్ల రేవతి.. కాజా టోల్గేట్ ఉద్యోగులపై దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. టోల్ ఫీజు చెల్లించకుండా కారులో వెళ్తోన్న ఆమెను టోల్గేట్ సిబ్బంది అడ్డుకోవడంతో ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారిపై దురుసుగా ప్రవర్తించారు. వాగ్వివాదానికి దిగారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. విధులకు ఆటంకం కలిగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె వైఖరి పట్ల నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఆమెపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ వడ్డెర కార్పొరేషన్ ఛైర్పర్సన్ హోదా నుంచి తొలగించాలని నినదించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు సైతం ఇదే డిమాండ్ను వినిపించారు. ఈ వీడియోలు వైరల్గా మారిన కొన్ని గంటలకే గుంటూరు అర్బన్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఫెయిర్వేస్ టోల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ మ్యాన్ పవర్ మేనేజర్ కోలంటి ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీలోని 188,294-బీ, 323, 341, 506, 34 సెక్షన్ల కింద ఈ ఉదయం 10 గంటలకు కేసు పెట్టారు.
బుధవారం ఉదయం 10 గంటల సమయంలో దేవళ్ల రేవతి ఈ దాడికి పాల్పడినట్లు కోలంటి ప్రవీణ్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న నల్లబోతుల నటరాజ్ అనే లైన్ అటెండెంట్పై ఆమె దాడికి పాల్పడ్డారని, ఆ సమయంలో బూతులు మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమె ముఖ్యమంత్రికి చెప్పి.. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్లో దేవళ్ల రేవతిని అక్యూస్డ్ నంబర్ 2గా గుర్తించారు. ఏ1గా ఆమె కారు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కే ఏడుకొండలు పేర్కొన్నారు.