శ్రీలక్ష్మి చేతుల మీదుగా.. బోణీ
గుంటూరు: వై శ్రీలక్ష్మి.. ఏరికోరి ఏపీకి వచ్చిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి. భవిష్యత్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ అవుతారనే ప్రచారం చాలాకాలం నుంచీ ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అదే పనిగా ఆమె ఏపీకి వచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పని చేయడానికి ఆసక్తిగా ఉండటమే దీనికి కారణం. అదే స్థాయిలో ఆమెను ఆదరిస్తోన్నారు వైఎస్ జగన్.
సీబీఐ కేసుల నుంచి..
ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో శ్రీలక్ష్మి సీబీఐ కేసులను ఎదుర్కొన్నారు. ఆమెపై నమోదైన కేసులన్నింటినీ కొట్టి పారేసింది తెలంగాణ హైకోర్టు. ఈ కేసు నుంచి ఆమెకు ఊరట లభించింది. సీబీఐ నమోదు చేసిన కేసులు ఏవీ నిలవలేదు. ఆమె అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలను సీబీఐ అధికారులు న్యాయస్థానానికి సమర్పించలేకపోయారు. దీనితో శ్రీలక్ష్మిపై నమోదైన కేసులన్నింటినీ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
ఏరికోరి ఏపీకి..
1988 బ్యాచ్కు చెందిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి. ఉమ్మడి ఆంధప్రదేశ్లో గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆమెను తెలంగాణకు కేటాయించింది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. తెలంగాణలో కీలక శాఖల్లో పనిచేశారు. 2019 తరువాత వైఎస్ జగన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆమె ఏరికోరి ఏపీకి పోస్టింగ్ వేయించుకున్నారు. తన స్టేట్ క్యాడర్ను కూడా మార్చుకున్నారు. ఏపీ క్యాడర్కు బదలాయించుకున్నారు.
సముచిత స్థానంలో..
తన ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఆమెకు ప్రాధాన్యతను ఇస్తూ వస్తోన్నారు. కీలకమైన మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జగనన్న ఇళ్ల కాలనీ నిర్మాణం శ్రీలక్ష్మీ బ్రెయిన్ ఛైల్డ్గా చెబుతుంటారు అధికారులు. కాగా పట్టణ పరిపాలనలో విప్లవాత్మక మార్పులకూ శ్రీకారం చుట్టారు. తాజాగా పట్టణాల్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు శ్రీలక్ష్మి.
మంగళగిరిలో..
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి కాలనీలో కొత్తగా నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ శ్రీలక్ష్మి ఇవ్వాళ ప్రారంభించారు. రాష్ట్రంలో 95 శాతం పట్టణ ప్రాథమిక కేంద్రాల నిర్మాణం పూర్తయిందని ఆమె పేర్కొన్నారు. సకాలంలో వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రాబోతోన్నామని చెప్పారు. అందులో భాగంగా- ఇవ్వాళ ఇక్కడ ఈ హెల్త్ కేర్ సెంటర్ను ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 522 అర్బన్ హెల్త్ సెంటర్లను రికార్డు స్థాయిలో పూర్తి చేశామని, మరో 189 ఆరోగ్య కేంద్రాలకు మరమ్మత్తులు పూర్తి చేశామని పేర్కొన్నారు.