జాతీయ మహిళా కమీషన్ ను ఆశ్రయించిన ఎమ్మెల్యే శ్రీదేవి .. డీజీపీకి నోటీసులు జారీ చేసిన కమీషన్
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కులవివక్ష వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. గుంటూరు జిల్లా అనంతవరంలో వైసీపీ దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కుల వివక్ష వ్యాఖ్యలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటమే కాకుండా జాతీయ మహిళా కమీషన్ ను ఆశ్రయించారు.
పల్నాడు పై టీడీపీది అసత్య ప్రచారం అని హోం మంత్రి సుచరిత ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి పండుగ రోజున వినాయకుడి సాక్షిగా ఓ దళిత ఎమ్మెల్యేకు జరిగిన అవమానం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది . వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో కొందరు టిడిపి నేతలు దూషించటం,ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టటం పెద్ద చర్చకు కారణం అయ్యింది. తనను అవమానించిన వారిపై న్యాయపోరాటానికి సిద్ధం అయిన శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదుతో అప్పట్లో టీడీపీ నేతలు కొమ్మినేని శివయ్య, కొమ్మినేని సాయి, కొమ్మినేని రామకృష్ణ, కొమ్మినేని బుజ్జిలపై తుళ్లూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించారు.
అనంతవరంలో వినాయక మండపానికి వెళ్లిన తనపై కొందరు కుల, లింగ వివక్ష వ్యాఖ్యలు చేశారని శ్రీదేవి జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు నోటీసులు జారీచేసింది.ఇక ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో తమకు నివేదికను అందించాలని సవాంగ్ కు జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి ఈ ఇష్యూపై పోరాటం గట్టిగానే చేస్తున్నట్టు కనిపిస్తుంది.