తుగ్లక్ గారూ .. పోలవరంపై కేంద్ర మంత్రి చెప్పింది విన్నారా ? జగన్ పై లోకేష్ వ్యంగ్యాస్త్రాలు
Recommended Video
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జల శక్తి వనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలతో జగన్ సర్కార్ చేసిన పని కేంద్రానికి కూడా నచ్చలేదని మాజీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోస్ట్ చేశారు . పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల రద్దు ఎఫెక్ట్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని లోక్ సభ వేదికగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు . ఏపీ ప్రభుత్వ నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు కొత్త అవరోధం అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలను తుగ్లక్ గారూ ఉన్నారా... కేంద్రమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు విన్నారా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

పోలవరం టెండర్ల రద్దు నిర్ణయం పోలవరానికి నష్టం అన్న కేంద్రమంత్రి
పోలవరం ప్రాజెక్ట్ పై రీ టెండర్లకు వెళ్ళాలని , ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ ప్రాతిపదికపై పని చేస్తున్న నవయుగ, బెకం సంస్థలకు టెండర్ల రద్దుకు నోటీసులు ఇచ్చింది వైసీపీ సర్కార్ . పోలవరంపై కమ్ముకున్న నీలినీడల నేపధ్యంలో పోలవరం టెండర్ల రద్దు అంశం లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేవనెత్తారు.
పోలవరం అంశం పై మాట్లాడిన మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దు అత్యంత బాధాకరమైన విషయంగా చెప్పటమే కాకుండా టెండర్ల రద్దుతో నిర్మాణ వ్యయం, సమయం రెండు పెరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని , ఇది చాలా తప్పు నిర్ణయంగా జల శక్తి వనరుల మంత్రి షెకావత్ అభిప్రాయపడ్డారు.

కేంద్రమంత్రి వ్యాఖ్యలతో జగన్ పై లోకేష్ మాటల దాడి ..కేంద్ర వ్యవస్థలకు కనిపించని అవినీతి మీకే కనిపించిందా?
ఇక ఇదే విషయంపై నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'తుగ్లక్ గారూ.. ఉన్నారా? లోక్ సభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఏం చెప్పారో విన్నారా? అంటూ ప్రశ్నించిన లోకేష్ పోలవరం టెండర్లు రద్దు చేయడం బాధాకరం. మీ తుగ్లక్ చర్యల వల్ల ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది. ఖర్చు కూడా పెరుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు' అని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో రూ. 2,600 కోట్ల అవినీతి జరిగిపోయిందంటూ తలతిక్క లెక్కలు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్కుందని చెప్పారు. అంతే కాదు కేంద్ర వ్యవస్థలకు కనిపించని అవినీతి మీకే కనిపించిందా అంటూ ప్రశ్నించారు.

రివర్స్ టెండరింగ్ అంటే పోలవరానికి టెండర్ పెట్టినట్టే అన్న లోకేష్
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆషామాషీ కాదని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జల సంఘం, కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన తర్వాతే నాబార్డ్ నిధులను విడుదల చేస్తుందని నారా లోకేశ్ తెలిపారు. కేంద్ర వ్యవస్థలకు కనిపించని అవినీతి మీకు మాత్రమే కనిపించిందని జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రివర్స్ టెండరింగ్ అంటే ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరానికి టెండర్ పెట్టడమనే విషయం అందరికీ అర్థమవుతోందని చెప్పారు. ఇక తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు అదే విషయాన్ని అర్ధం అయ్యేలా చెప్తున్నాయని నారా లోకేష్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications