ఏపీ రాజకీయాలను మనమే శాసించబోతున్నాం: ఆ విమర్శలకు సమాధానం ఇస్తా: పవన్ కల్యాణ్
గుంటూరు: పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ సోమవారం ఆవిర్భావ సభను జరుపుకోనుంది. ఈ సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీన్ని విజయవంతం చేయడానికి పార్టీ అగ్ర నాయకత్వం 12 కమిటీలను ఏర్పాటు చేసింది. సభను విజయవంతం చేయడం ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని జనసేన భావిస్తోంది. ఆవిర్భావ దినోత్సవ సభ కావడం వల్ల పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి విధానపరమైన ప్రకటనలు ఉండొచ్చనే విషయం చర్చనీయాంశమైంది.

ఏపీకి దిశానిర్దేశం చేయబోయే సభ..
ఆ అంచనాలను నిజం చేస్తూ తాజాగా పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించుకోనున్న సభ అల్లాటప్ప కాదని స్పష్టం చేశారు. ఏపీ భవిష్యత్కు దిశానిర్దేశం చేయబోతోన్నామని అన్నారు. రాష్ట్ర రాజకీయాలను శాసించబోతోన్నామని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు, ఉపద్రవాలను ఎదుర్కొన్నారనే విషయాన్ని చర్చించనున్నామని పేర్కొన్నారు.

రానివ్వకుండా అడ్డుకోవద్దు..
భావి తరాలకు ఎలాంటి భరోసాను కల్పిస్తే బలమైన భవిష్యత్తును ఇవ్వగలమనే విషయంపై తాను పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభలో మాట్లాడబోతున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ సభకు రానివ్వకుండా ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పోలీసులను అడ్డుగా పెట్టి.. తమ సభకు రానివ్వకుండా ఇబ్బందులను కల్పించాలనుకోవడం సరికాదని చెప్పారు. సభ విజయవంతం కావడానికి సహకరించాలని ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

సభకు రావడం హక్కుగా..
జనసేన ఆవిర్భావ సభకు హాజరు కావడాన్ని ప్రతి ఒక్క సైనికుడు తమ హక్కుగా భావించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. జనసేనకు సంబంధించినంత వరకు ఇది అత్యంత కీలకమైన సభ అని, అనేక అంశలపై మాట్లాడబోతోన్నానని చెప్పారు. పార్టీ నిర్వహణ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయని, చాలామంది చాలా విమర్శలు చేశారని, వాటన్నింటికీ తాను సమాధానం చెప్పబోతోన్నానని తేల్చి చెప్పారు. తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం నిర్వహిస్తోన్న సభగా అభివర్ణించారు.

దామోదరం సంజీవయ్య పేరు..
గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం పరిధిలో గల ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటు కానుంది. రాష్ట్రం నలుమూలల నుంచి మూడు లక్షల మందికి పైగా హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. దీనికి హాజరయ్యే నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ అగ్ర నాయకత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ బాధ్యతను కమిటీలకు అప్పగించింది. సభా ప్రాంగణానికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేసింది.

విజయవంతానికి కమిటీలు..
జిల్లాల సమన్వయ కమిటీ, ఆహ్వాన కమిటీ, లైజన్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ కమిటీ, సభా ప్రాంగణ నిర్వహణ కమిటీ, క్యాటరింగ్ కమిటీ, భద్రత నిర్వహణ కమిటీ, సాంస్కృతిక కమిటీ, పబ్లిసిటీ కమిటీ, మీడియా కోఆర్డినేషన్ కమిటీ, వలంటీర్ల కమిటీ, మెడికల్ అసిస్టెన్స్ కమిటీలను అపాయింట్ చేసింది పార్టీ. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, సీనియర్ నాయకుడు నాగబాబు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications