పిన్నెల్లిపై దాడి : 10 మంది అరెస్ట్.. కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు
Recommended Video
గుంటూరు జిల్లా చినకాకానిలో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దాడి జరిగింది కారు పైనే అయినా.. ఎమ్మెల్యేపై దాడి గానే
ప్రభుత్వం చూస్తోంది. శాంతిభద్రతలను పరిరక్షించడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దాడిని సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వీడియో ఫుటేజీ ఆధారంగా తాడికొండ,తుళ్లూరు,మంగళగిరి పరిధిలో 10మందిని అదుపులోకి తీసుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసినవాళ్లలో చినకాకానికి చెందిన ఓ వ్యక్తి ఎక్కువ హల్చల్ చేసినట్టు గుర్తించారు.
ప్రస్తుతం అతను కూడా పోలీసుల అదుపులోనే ఉన్నట్టు సమాచారం. అమరావతి రైతుల ఆందోళనల ముసుగులో హింసాత్మక చర్యలకు పాల్పడడాన్ని ఉపేక్షించేది లేదని పోలీసులు చెబుతున్నారు.
ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీప్పవని హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు ఈ ఆందోళనల్లో పాల్గొని భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.

కాగా, రాజధాని తరలింపును నిరసిస్తూ మంగళవారం అమరావతి జేఏసీ,రైతులు హైవేల దిగ్బంధానికి దిగడం ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు అటు వైపుగా వచ్చి ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. అది అధికార పార్టీ ఎమ్మెల్యే కారు అని తెలియడంతో అంతా ఒక్కసారిగా కారు చుట్టూ గుమిగూడారు. కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. లాఠీచార్జి తర్వాత కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తతంగా మారాయి.
దాడి ఘటనను వైసీపీ నేతలంతా తీవ్రంగా ఖండించారు. ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగమేనని,ఆయనే ఈ దాడులు చేయిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు రోజా,అంబటి రాంబాబు తదితరులు ఆరోపించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి కూడా చంద్రబాబు పైనే ఆరోపణలు చేశారు. అక్కడ ఆందోళనల్లో పాల్గొన్నది నిజంగా రైతులే అయితే.. వారికి కర్రలు,రాళ్లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని, చంద్రబాబే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications