ఒక్కడివే వచ్చినా సరే.. 100 మందితో వచ్చినా సరే..!!
బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పల్నాడు రాజకీయ నాయకులు వేర్వేరు పార్టీల్లో ఉండి హోరాహోరీగా ఢీకొడుతుండటంతో ఇక్కడి వాతావరణంతోపాటు రాజకీయ వాతావరణం కూడా ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ఏపీ రాజకీయం ఒక ఎత్తయితే.. పల్నాడు రాజకీయం మరో ఎత్తు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో సంవత్సరం పొడవునా పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంటుంది. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కానంత ఉత్కంఠ అక్కడ నెలకొంటుంది.
టీడీపీ, వైసీపీ సవాళ్లు.. ప్రతిసవాళ్లు
కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులుగా సాగిన పోరు తర్వాత కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం వైసీపీ వర్సెస్ టీడీపీగా రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా ఉంది. అధికా, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తరుచుగా ఉద్రిక్తతలను రాజేస్తుంటుంది. తెలుగుదేశం పార్టీ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రూ.1500 కోట్లతో గురజాలను అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం ఉన్నదంతా తాము చేసినదేనని, గురజాలలో ఎటువంటి అభివృద్ధి లేదని, ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
యరపతినేనిపై ఘాటుగా స్పందించిన కాసు
యరపతినేని చేసిన వ్యాఖ్యలపై గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను రూ.3వేల కోట్లతో అభివృద్ధి చేశానో, టీడీపీ రూ.1500 కోట్లతో అభివృద్ధి చేసిందో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. గురజాల ఆర్ అండ్ బి బంగళాలో ఆదివారం తాను సిద్ధంగా ఉంటానని, యరపతినేని ఒక్కరే వచ్చినా సరే.. ఎంతమందితో వచ్చినా సరే.. తాను లెక్కలతో సిద్ధమన్నారు. యరపతినేని రమ్మంటే ఆయన ఇంటికైనా వెళ్లడానికి సిద్ధమన్నారు.
పల్నాడులో సవాల్ పైనే చర్చ
ప్రస్తుతం పల్నాడులో ఎక్కడ చూసినా ఈ ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లపై చర్చ నడుస్తోంది. ఆదివారం రోజు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. మహేష్ రెడ్డి చేసిన సవాల్ కు టీడీపీ నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. గతంలో కూడా వీరిద్దరూ సవాళ్లు.. ప్రతిసవాళ్లు రువ్వుకున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఒక కార్యక్రమం నుంచి లైవ్ గా యరపతినేనికి హెచ్చరికలు జారీచేశారు. తాజాగా జరుగుతున్న పోరు ఎటువైపు మలుపు తిరుగుతుందోననే చర్చ నడుస్తోంది.