రమ్య హత్యకేసు.. ఉద్రిక్తత : ఎవరి బిడ్డైనా ఒకటే; నా కొడుక్కి తగిన శాస్తి జరగాల్సిందేనన్న నిందితుడి తల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతం కలకలం రేపిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా కాకాణిలో నడిరోడ్డుపై బీటెక్ విద్యార్థిని రమ్యను శశి కృష్ణ నిందితుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇంటి నుండి సమీపంలోని ఒక షాప్ కి వెళ్లిన సమయంలో శశి కృష్ణ అనే యువకుడు షాపు వద్ద ఆమెతో గొడవకు దిగి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. విచక్షణారహితంగా రమ్యపై దాడి చేసిన నేపథ్యంలో స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే రమ్య మృతి చెందింది . ఇక హత్య ఘటనపై ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రమ్య ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తం
పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువతిని హతమార్చినా జగన్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుంటూరులో బీటెక్ విద్యార్థిని హత్య పై స్పందించిన సీఎం జగన్ బాధితురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం అందించడమే కాకుండా, ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితుడికి ఘటన శిక్షపడేలా చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థి రమ్య ఇంటివద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రమ్య కుటుంబానికి అధికార, ప్రతిపక్ష నేతల పరామర్శల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

తన కొడుకు అమ్మాయిని చంపటం తప్పేనన్న శశికృష్ణ తల్లి
మరోవైపు ఇప్పటికే రమ్య హత్య కేసు నిందితుడు శశి కృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇక తాజాగా బీటెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతంపై శశి కృష్ణ తల్లి స్పందించారు. తన కొడుకు ఆ అమ్మాయి ని చంపడం తప్పేనని, అలా చేయటం కరెక్ట్ కాదని పేర్కొన్నారు శశి కృష్ణ తల్లి. తన కుమారుడు చేసిన పనికి తగిన శాస్తి జరగాల్సిందేనని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. శశి కృష్ణ , రమ్య ల పరిచయం గురించి తనకు తెలియదని, ఈ మధ్యకాలంలో శశి కృష్ణ తనలో తాను బాధపడుతూ ఎందుకో కుమిలిపోతున్నాడని, ఒంటరిగా ఉంటున్నాడని, అర్ధరాత్రి వరకు మేలుకొని ఉంటున్నాడని తెలిపింది.

ఎవరి బిడ్డలైనా ఒకటే అంటూ ఆవేదన
తన కొడుకుని ఎన్నిసార్లు అడిగినా విషయం చెప్పలేదని పేర్కొన్న ఆమె ప్రేమ పేరుతో అమ్మాయిని హతమార్చిన తన కొడుకు చేసిన పని తప్పేనని, తన కొడుక్కి తగిన శాస్తి జరగాల్సిందేనని కన్నీరు మున్నీరవుతూ వెల్లడించింది. ఎవరి పిల్లలైనా పిల్లలే అని వెల్లడించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రమ్య హత్యోదంతం ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజేసింది. ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా మారింది. రాష్ట్రంలో డిశా వంటి చట్టాలు ఉన్నా మహిళలకు రక్షణ లేదని వెల్లడించింది.

బాధిత కుటుంబానికి లోకేష్ పరామర్శ .. రమ్య ఇంటి వద్ద ఉద్రిక్తత
ఇదిలా ఉంటే ప్రేమోన్మాది దాడి చేసిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రమ్య మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం రమ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వాహనాన్ని అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిజిహెచ్ నుండి రమ్య మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో మృతదేహాన్ని మరో మార్గం నుండి స్వగ్రామానికి తరలించినప్పటికీ రమ్య స్వగ్రామంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరమాయకుంటకు చేరుకుని రమ్య బౌతికకాయానికి నివాళులు అర్పించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆపై నిందితులకు శిక్ష పడేవరకు పోరాటం చేస్తామని నారా లోకేష్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications