సాత్విక్ కేసులో ట్విస్ట్ ? ఆ వీడియోలో ఉన్నది సాత్విక్ కాదు .. అసలు విషయం తేల్చిన పోలీసులు
గుంటూరు : జిల్లాలో కలకలం రేపిన సాత్విక్ మృతి మరో మలుపు తీసుకుంది. ఆ చిన్నారిది హత్య కాదని పోలీసులు తెలిపారు. ఆడుకుంటూ వెళ్లి క్వారీలో పడిపోయాడని వివరించారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన బాలుడు సాత్విక్ కాదని పోలీసులు స్పష్టంచేశారు.
ప్రాణం తీసిన క్వారీ ..
సాత్విక్ అదృశ్యం .. ఆ తర్వాత కిడ్నాప్నకు గురయ్యాడనే వార్తలు గుప్పుమన్నాయి. దీనికితోడు గుంటూరు రైల్వేస్టేషన్లో కనిపించిన సీసీటీవీ ఫుటేజీ దీనికి బలం చేకూర్చింది. అయితే కేసును క్షేత్రస్థాయిలో విచారించిన పోలీసులు .. సాత్విక్ది హత్య కాదని .. ప్రమాదవశాత్తు క్వారీలో పడిపోయి చనిపోయాడని వివరించారు.
కిడ్నాప్ .. కాదు కాదు ...
ఈ నెల 22న ఇంటిముందు ఆడుకుంటోన్న సిద్ధు కనిపించలేదు. దీంతో వారి పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో కిడ్నాప్నకు గురయ్యాడని భావించామని .. సీసీటీవీ ఫుటేజీలో ఉన్నదని ఆ బాలుడేనని అనుకొన్నామని గురజాల డీఎస్పీ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అయితే కేసు విచారణ జరిపే సమయంలో ఆ బాబు అరండల్ పేటకు చెందిన మరో బాలుడని తేలిందని చెప్పారు. సాత్విక్ కిడ్నాప్ గురికాలేదని .. ఇంటి ముందు ఆడుకుంటూ ... 400 మీటర్ల దూరంలో ఉన్న క్వారీ గుంటలో ప్రమాదవశాత్తు పడి చనిపోయాడని వివరించారు. క్వారీ దగ్గర సాత్విక్ ఆడుకుంటున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించామని .. వారి సాక్ష్యాధారాలతో సాత్విక్ది హత్యకాదని నిర్ధారించామని తెలిపారు.
ఇదీ విషయం
గురువారం ఉదయం మాచర్ల శివారులోని క్వారీ గుంతలో బాలుడి మృతదేహం లభించడంతో హత్యకు గురైనట్టు తొలుత భావించామని ఆయన చెప్పారు. అయితే విచారణలో ఆసలు విషయం వెలుగుచూసిందని పేర్కొన్నారు.