జగన్ ఆ ఆదేశాలిచ్చిన రోజే... 5గంటలు తల్లడిల్లి.. బెడ్ దొరక్క ప్రాణాలు విడిచిన కోవిడ్ బాధితురాలు...
పేషెంట్ ఆస్పత్రికి వచ్చిన 30 నిమిషాల్లో అడ్మిషన్ జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం(జూలై 29) అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఈ ఆదేశాలిచ్చిన రోజే ఓ కరోనా పేషెంట్ ఆస్పత్రిలో బెడ్ దొరక్క కన్నుమూసింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 5గంటల పాటు వేచి చూసినా ఆస్పత్రిలో ఆమెకు బెడ్ దొరక్కలేదు. చివరకు క్యాజువాలిటీలో చేర్చినా... సరైన సమయానికి ఆక్సిజన్ అందక ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఐదు గంటలు వేచి చూసినా...
విజయవాడ సూర్యారావుపేటకు చెందిన ఓ మహిళ(49) రెండు రోజులుగా విరేచనాలతో బాధపడుతోంది. జ్వరం,దగ్గు ఏమీ లేనప్పటికీ... ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించారు. బుధవారం(జూలై 29) ఫోన్ చేసిన వైద్యాధికారులు ఆమెకు పాజిటివ్గా తేలినట్లు చెప్పారు. దీంతో హుటాహుటిన ఆమెను తీసుకుని కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 10గం.కు అక్కడికి చేరుకోగా... దాదాపు 5గంటలు వేచి చూసినా ఆస్పత్రిలో బెడ్ మాత్రం దొరకలేదు.

తల్లడిల్లిన బాధితురాలు...
ఆ ఐదు గంటలు బాధితురాలు కారులోనే ఉండిపోయింది. ఒక దశలో శ్వాస అందక తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో... కుటుంబ సభ్యులు డాక్టర్ల కాళ్లా వేళ్లా పడి బతిమాలారు. దీంతో ఎట్టకేలకు మధ్యాహ్నం 3గంటలకు క్యాజువాలిటీలో చేర్చుకున్నారు. అయితే అక్కడ కూడా బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో బాధితురాలు నేల పైనే కూర్చుండిపోయింది. ఊపిరి ఆడట్లేదని... శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉందని బాధితురాలు తల్లడిల్లింది.

ఆక్సిజన్ తీసేయడంతో మృతి...
ఎలాగైనా తమ తల్లికి ఆక్సిజన్ అందించాలంటూ ఆమె కుమార్తె వైద్యులను బతిమాలింది. దీంతో క్యాజువాలిటీలోనే ఆక్సిజన్ అమర్చిన ఓ పేషెంట్ నుంచి దాన్ని తొలగించి ఆమెకు అమర్చారు. అయితే సదరు రోగి కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో చివరకు ఆమెకు ఆక్సిజన్ తొలగించి తిరిగి అతనికే అమర్చారు. దీంతో కొద్దిసేపటికే బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యమే ఆమెను బలితీసుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.బాధితురాలి కుమార్తె మాట్లాడుతూ... 'తన తల్లికి ట్రీట్మెంట్ ఇచ్చినా చనిపోయి ఉంటే... ఆమె ఆయుష్షు అంతవరకే ఉందని భావించేవాళ్లం. కానీ ట్రీట్మెంట్ అందక ఆమె చనిపోయింది.డాక్టర్లు,ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులైతే ఇలాగే చేస్తారా..? సామాన్యుల ప్రాణాలంటే లెక్కలేదా. మా అమ్మకు ట్రీట్మెంట్ అందించాలని ఎంత బతిమాలినా వినిపించుకోలేదు.' అని వాపోయారు.
Recommended Video

జగన్ ఆదేశాలిచ్చిన రోజే...
కరోనా పరిస్థితులపై బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.కరోనా రోగికి ఖచ్చితంగా 30 నిమిషాల్లో బెడ్ కేటాయించాలని.. రాష్ట్రంలో ఉన్న 138 కోవిడ్ ఆసుపత్రుల్లో ఎక్కడా కూడా బెడ్ దొరకలేదన్న మాట రాకూడదని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా బెడ్ దొరకలేదంటే కలెక్టర్లు, జేసీలు తప్పనిసరిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏ ఆస్పత్రిలోనూ వైద్యానికి నిరాకరించే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. జగన్ వ్యాఖ్యలతో చాలామందికి భరోసా లభించింది. కరోనా పట్ల సీఎం తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తమైంది. అయితే ఇంతలోనే విజయవాడ ఘటన వెలుగుచూడటం చర్చనీయాంశమవుతోంది. సీఎం జగన్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications