పోలీసులకు చెప్పకుండా వెళ్లొద్దు... టీడీపీ నేతలకు ఏపీ హోంమంత్రి సలహా..
నిన్న గుంటూరు జిల్లా పల్నాడుకు బయలుదేరిన టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నపై వైసీపీ శ్రేణుల దాడుల నేపథ్యంలో ఏపీ హోంమంత్రి సుచరిత స్పందించారు. పోలీసులకు చెప్పకుండా వెళ్లడం వల్లే టీడీపీ నేతలపై దాడులు జరిగాయన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీడీపీ నేతలు రాష్ట్రంలో పర్యటించవద్దని ఆమె పరోక్షంగా విపక్ష నాయకులకు సూచించారు. దీనిపై స్పందించిన టీడీపీ నాయకులు స్ధానిక ప్రచారానికి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు.

పల్నాడులో టీడీపీ నేతలపై దాడి
ఏపీలో స్ధానిక పోరు నేపథ్యంలో గుంటూరు జిల్లా పల్నాడులో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పల్నాడులో టీడీపీ నేతల నామినేషన్ కార్యక్రమానికి మద్దతు పలికేందుకు కారులో బయలుదేరిన టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నపై వైసీపీ నేతలు దాడులకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్నాయి. సకాలంలో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే వైసీపీ నేతలు తమపై దాడికి దిగడంపై బోండా, బుద్ధా ఇద్దరూ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన నిన్న రాత్రి ఈ ఘటనకు నిరసనగా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం ముందు బైఠాయిచారు.

దాడి నేపథ్యంలో హోంమంత్రి సూచన
పల్నాడుకు బయలుదేరిన టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమ కారుపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని ఖండించాల్సిన ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో టీడీపీ నేతలకు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. టీడీపీ నేతలు ఎక్కడైనా పర్యటించాలనుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అప్పుడే దాడులను నివారించగలుగుతామన్నారు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పల్నాడు వెళ్లడం వల్లే టీడీపీ నేతలపై దాడి జరిగిందని సుచరిత చెప్పుకొచ్చారు.

హోంమంత్రి సలహాపై టీడీపీ ఆగ్రహం
పల్నాడు ఘటనపై ఏపీ హోంమంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్ధానిక ఎన్నికల పోరు సందర్బంగా రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే హక్కు తమకుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నేతల దాడులపై మాట్లాడకుండా పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని తమకు హోంమంత్రి ఉచిత సలహాలు ఇవ్వడమేంటని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడులను అరికట్టడంలో విఫలమైన పోలీసులకు తాము ముందుగా సమాచారం ఇవ్వడం వల్ల ప్రయోజనమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.
Recommended Video


వైసీపీ దాడిపై మాట్లాడని సుచరిత...
పల్నాడు ప్రాంతానికి బయలుుదేరిన టీడీపీ నేతల కారుపై రాయవరం సమీపంలో వైసీపీ నాయకులు దాడి చేసినట్లు తేలినా హోంమంత్రి మాత్రం దానిపై స్పందించలేదు. అదే సమయంలో టీడీపీ నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని చెప్పడం ద్వారా హోంమంత్రి దాడులను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. స్ధానిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హోంమంత్రి స్పందన, టీడీపీ నేతలకు సలహా చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications