లెక్కేసి కొడుతున్న జగన్ - బిత్తర చూపులు..!!
గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పంథా మార్చారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిచి తీరాల్సిందేనంటూ పార్టీ క్యాడర్కు దిశా నిర్దేశం చేసిన ఆయన- దానికి అనుగుణంగా తన పరిపాలనను సాగిస్తోన్నారు. ప్రత్యర్థుల కంచుకోటలను బద్దలు కొట్టడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలకు నిధుల వరదను పారిస్తోన్నారు. టీడీపీ వేళ్లూనుకుంటోందని భావించిన చోట్లా అదే వ్యూహాన్ని అనుసరిస్తోన్నారు.
175 స్థానాల్లో
ఇదివరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అభివృద్ధి కోసం వైఎస్ జగన్ పలు చర్యలను తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కావడం వల్ల ఈ సారి అక్కడ విజయఢంకా మోగించి తీరాలనే పట్టుదలతో ఉన్నారాయన. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పాన్ని వైఎస్ జగన్ మున్సిపాలిటీగా మార్చారు. పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేశారు.
22న కుప్పానికి..
ఒకేసారి 66 కోట్ల రూపాయలను ఈ మధ్యే విడుదల చేశారాయన. ఈ నిధులతో కుప్పంలో చేపట్టదలిచిన అభివృద్ధి పనులకూ వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ఈ నెల 22వ తేదీన ఆయన కుప్పంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైఎస్ జగన్ కుప్పం పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోండటం ఇదే తొలిసారి. దీనితో ఆయన పర్యటనపైనే అందరి దృష్టీ నిలిచింది.
మంగళగిరిపై..
అదే సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరికీ పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు. 137.11 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల అయ్యాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మున్సిపల్ పరిపాలన మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేశారు. సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ వ్యవస్థ, బీటీ రోడ్ల నిర్మాణం, రహదారుల విస్తరణ వంటి పనులను ఈ నిధుల కింద చేపట్టనుంది ప్రభుత్వం. సీసీ రోడ్లు-రూ.29.03, సీసీ డ్రైనేజీ-రూ.29.87, బీటీ రోడ్లు-రూ.54.86, రోడ్లు విస్తరణ-13.35 కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది.
ఆ ప్రతిపాదనలకు ఆమోదం..
దీనితో పాటు రోజుకు 4.5 మిలియన్ గ్యాలన్ల సామర్థ్యంతో కూడిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా ప్రభుత్వం మంగళగిరి పట్టణానికి మంజూరు చేసింది. 10 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఇదివరకే పంపించారు మంగళగిరి అధికారులు. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.137 కోట్లు..
మంగళగిరికి 137 కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేయడం అటు రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతోన్న వేళ.. ఆ ప్రాంతానికి గుండెకాయగా చెప్పుకొనే మంగళగిరి అభివృద్ధికి ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం చర్చనీయాంశమౌతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు.
మరో స్థానం కోసం..
మంగళగిరి నియోజకవర్గంపై మరింత పట్టును పెంచుకోవడంలో భాగంగా వైఎస్ జగన్.. పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేశారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు గంజి చిరంజీవి- వైఎస్ఆర్సీపీలో చేరడంతో తిరుగులేని విధంగా తయారైంది. చంద్రబాబు సొంత నియెజకవర్గం కుప్పాన్ని, నారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరిపై పట్టు నిలుపుకోవడం వల్ల ఆ ఇద్దరూ మరో స్థానం కోసం వెదుక్కునే పరిస్థితిని కల్పించినట్టయిందని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు.