ఏపీలో మద్య నిషేధం సాధ్యమేనా? జగన్ హామీ వర్కౌట్ అవుతుందా?

గుంటూరు : అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ సుడిగాలి పర్యటలతో హోరెత్తిస్తున్నారు. కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్న ఆయన.. ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యపాన నిషేధం విధిస్తామని హామీ ఇస్తున్నారు. వినేందుకు ఇంట్రెస్టింగుగా ఉన్నాఎన్నికల సమయంలో రాజకీయ నాయకులే ఓటర్లకు మద్యాన్ని ఎరగా వేస్తున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఇస్తున్న ఈ హామీ అమలు సాధ్యమేనా? ఆర్థిక లోటు పేరుతో ప్రభుత్వాలే విచ్చలవిడిగా ప్రజలకు మద్యం సరఫరా చేస్తున్న ఈ రోజుల్లో జగన్ హామీ వర్కౌట్ అవుతుందా? ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల గురించి ప్లాన్ చేయకుండా మద్య నిషేధం హామీ ఇచ్చి రిస్క్ తీసుకుంటున్నాడా?

కుటుంబ వ్యవస్థ నాశనం

కుటుంబ వ్యవస్థ నాశనం

మద్యం రాకాసి ఎన్నో జీవితాలను నాశనం చేసింది. చేస్తోంది. దీని కారణంగా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. తాగుబోతులైన తండ్రుల వేధింపుల కారణంగా నిత్యం నరకయాతన నుభవిస్తున్న భార్యా పిల్లలకు లెక్కే లేదు. నేరాలు ఘోరాలు పెరగడంతో మద్యానిదే కీలక పాత్ర. అయినా ప్రభుత్వాలు మాత్రం మద్య నిషేధం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టవు. మంచినీటిని అందించేందుకు మీనమేషాలు లెక్కించే సర్కారులు మద్యం అమ్మకానికి లైసెన్సులు ఇచ్చేందుకు మాత్రం ముందు వెనుక ఆలోచించవు.

మద్యం అమ్మకాలపై ఏపీ మహిళల సమరశంఖం

మద్యం అమ్మకాలపై ఏపీ మహిళల సమరశంఖం

ప్రస్తుతం ఏపీలో ఇళ్ల మధ్యనే మద్యం దుకాణాలు వెలుస్తున్నాయి. దీంతో మహిళలంతా ఏకమై బెల్ట్ షాపులపై దాడులు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిపై వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తి వైసీపీకి అనుకూలంగా మారే అవకాశముంది. ఈ కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో మద్య నిషేధ అంశాన్ని బలంగా వాడుకోవాలని వైసీపీ నిర్ణయించింది. అందుకు తగ్గట్లే జగన్ మద్య నిషేధ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మూడు దశల్లో మద్యాన్ని నిషేధం

మూడు దశల్లో మద్యాన్ని నిషేధం

నిజానికి మూడు దశల్లో మద్యపాన నిషేధమన్నది జగన్ ఇప్పుడు చెబుతున్న మాట కాదు. పార్టీ ప్లీనరీలో చర్చించడంతో పాటు నవరత్నాల్లో ఈ అంశాన్ని చేర్చారు. తాజాగా ఎన్నికల ప్రసంగాల్లోనూ మద్య నిషేధ అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. మద్యం మహమ్మారి నుంచి జనాన్ని కాపాడేందుకు ఇప్పటికే మూడు దశల ప్రణాళిక రూపొందించామంటున్న వైఎస్ జగన్ తొలి దశలో మద్యం దుకాణాల సంఖ్యను భారీగా తగ్గించడంతో పాటు ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెంచుతామని చెబుతున్నారు. అంతేకాదు మద్యం మహమ్మారి వల్ల కుటుంబాలు ఎలా నాశనమవుతున్నాయో వివరిస్తూ సినిమా థియేటర్లు, టీవీల్లో ప్రకటనలు ఇస్తామని అంటున్నారు. రెండో దశలో మద్యపాన వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారికోసం ప్రతి జిల్లాలో రీ హాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి మంచి జీవితాన్ని అందిస్తామని చెబుతున్నారు. ఇక చివరి దశలో మద్యం కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే అందుబాటులో ఉండేలా చూస్తామని చెబుతున్నాడు. ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరైనప్పటికీ రిస్క్ తీసుకుని మద్యం రేట్లను పెంచుతామని చెబుతున్న వైసీపీ అధినేత, మద్యం తయారు చేసినా, అమ్మినా ఏడేళ్ల శిక్ష విధించేలా చట్ట సవరణ చేస్తామని స్పష్టం చేశారు.

గతంలో మధ్య నిషేధంపై కాంగ్రెస్ టీడీపీ పోటాపోటీ

గతంలో మధ్య నిషేధంపై కాంగ్రెస్ టీడీపీ పోటాపోటీ

అప్పుడు ఇప్పుడు అని కాదు... మద్య నిషేధం ఎప్పుడూ ఎన్నికలను ప్రభావితం చేసేదే. పేద, మధ్యతరగతి మహిళలంతా ఈ నిర్ణయానికి అనుకూలం. అందుకే 1992-94 ప్రాంతంలో మద్య నిషేధంపై కాంగ్రెస్, టీడీపీలు పోటాపోటీగా హామీలిచ్చాయి. అప్పట్లో టీడీపీ గెలుపుతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మద్యపాన నిషేధం విధించారు. కానీ ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య అధికారం చేపట్టిన చంద్రబాబు క్రమంగా మద్య నిషేధం తొలగించారు. ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ ఆయన మధ్య నిషేధం ఊసు ఎత్తలేదు.

అప్పట్లో వైఎస్, ఇప్పుడు జగన్

అప్పట్లో వైఎస్, ఇప్పుడు జగన్

పక్కా ప్రణాళికతో మూడు దశల్లో మద్యపాన నిషేధం విధిస్తామంటూ జగన్ చెబుతున్నా ఆయన ఇచ్చిన హామీ అమలు సాధ్యమేనా? ప్రస్తుతం అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. ఇప్పుడు జగన్ చెబుతున్నట్లుగానే 2003 పాదయాత్ర సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా మద్యపాన నిషేధం విధిస్తానంటూ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు.

రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం

రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం

రెవెన్యూపరంగా ఏపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కొత్త ఆదాయ మార్గాలను రూపొందించడంలో విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోఎక్కువ ఆదాయం వస్తున్నది మద్యం అమ్మకాల నుంచే సమకూరుతోంది. ఫలితంగా రెవెన్యూ లోటు కొంత వరకు తీరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మద్య నిషేధం విధిస్తే రాష్ట్ర ఆదాయం రుణంగా పడిపోయి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడుతుంది. అదే జరిగితే బొటాబొటి నిధులతో రాష్ట్రాన్ని నెట్టుకురావడం అంత ఈజీకాదు.

ఆదాయ మార్గాలు కనుక్కుంటే అమలు సాధ్యమే

ఆదాయ మార్గాలు కనుక్కుంటే అమలు సాధ్యమే

జగన్ చెబుతున్నట్లు మద్య నిషేధాన్ని అమలుచేయాలంటే ముందు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలి. పక్కా ప్రణాళిక రూపొందించి దాన్ని ప్రజలకు వివరించాలి. అప్పుడే జనాల్లో ఆయనపై విశ్వసనీయత పెరుగుతుంది. ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చిన మాట ప్రకారం మద్య నిషేధం అమలు చేయడం సాధ్యమవుతుంది. లేని పక్షంలో అందరు రాజకీయ నాయకుల్లాగే వైఎస్ జగన్ హామీలు కూడా నీటి మీద రాతలే అవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+