హిందూపురంలో పొలిటికల్ హీట్: ఎమ్మెల్యే బాలకృష్ణపై కేసు పెట్టిన హిజ్రాలు.. ఎందుకంటే!!
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో కూడా ఆయన తనదైన మార్కు రాజకీయాలను చూపిస్తుంటారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై తనదైన శైలిలో మండిపడిన బాలకృష్ణ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, వైయస్సార్ సిపి సర్కార్ ను టార్గెట్ చేశారు. ఇక వైఎస్సార్సీపీ నేతలు కూడా బాలయ్య ను టార్గెట్ చేసిన నిప్పులు చెరిగారు. మంత్రులు సైతం బాలయ్యకు చురకలంటించారు. అయితే తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన బాలకృష్ణ
ఇటీవల జరిగిన వరుస పరిణామాలను చూస్తే బాలకృష్ణ సహజంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడరు. ఏదైనా చాలా సీరియస్ విషయం అయితేనే బాలకృష్ణ స్పందిస్తారు. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చడం పైన నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. సిగ్గులేని బతుకులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదని, ఓ సంస్కృతి, నాగరికత తెలుగుజాతి వెన్నుముక అని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.
శునకాలముందు తలవంచకుతిరిగే సిగ్గులేని బతుకులు: బాలకృష్ణ విమర్శలు
తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్టు పేరు మార్చాలని కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారని, మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు, పంచభూతాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అంటూ బాలకృష్ణ హెచ్చరించారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ మహనీయుడు పెట్టిన భిక్షతోబతుకుతున్న నేతలున్నారు పీతలున్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి అంటూబాలకృష్ణమండిపడ్డారు.శునకాలముందు తలవంచకుతిరిగే సిగ్గులేని బతుకులు అంటూ బాలకృష్ణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
బాలకృష్ణపై హిందూపురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన హిజ్రాలు
ఇక బాలయ్య చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల్లో అసహనం వెల్లువ కాగా, తాజాగా నందమూరి బాలకృష్ణ పై హిజ్రాలు హిందూపురం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం ఆసక్తికరంగా మారింది. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కనిపించడంలేదని మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి అని కొంతమంది హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గా విధులు నిర్వహించాల్సిన బాలకృష్ణ ఇక్కడ ఉండటం లేదని వెంటనే హిందూపురం లోని సమస్యలను పట్టించుకుని వాటికి పరిష్కారాలు వెతకాల్సిందిగా కోరుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాలకృష్ణపై చేసిన ఫిర్యాదుపై మండిపడుతున్న టీడీపీ నేతలు
అయితే ఈ ఫిర్యాదుపై టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ నేతలు హిజ్రాలను ముందు పెట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారని, హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న ఇక్బాల్ కు చెందిన వర్గం నేతలు బాలకృష్ణ పై కావాలని హిజ్రాలతో ఫిర్యాదు చేయించారని టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఆయన జగన్ దృష్టిలో పడాలన్న తాపత్రయంతో ఈ విధమైన పనులకు పాల్పడుతున్నాడని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో ఉన్నా, లేకపోయినా నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయటం లేదని టిడిపి నేతలు చెబుతున్నారు.
కావాలని అధినేత మెప్పు కోసం వైసీపీ నేతలు చేసిన పని: టీడీపీ
బాలకృష్ణ పై ప్రస్తుతం చేసిన ఫిర్యాదు కావాలని అధినేత మెప్పుకోసం చేసిన వైసిపి నేతలు చేయించిన ఫిర్యాదు తప్ప, ఆ ఫిర్యాదుకు ఎలాంటి ప్రాధాన్యత లేదని టిడిపి నేతలు అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జగన్ సర్కార్ ను గట్టిగా టార్గెట్ చేసిన బాలయ్యను నియోజకవర్గ కేంద్రంలో ఉండడం లేదని హిజ్రాలు ఫిర్యాదు చేసి గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.