135 కోట్ల మంది ఉంటే కొరత సహజమే కదా.. ఒవైసీకి విజయశాంతి కౌంటర్
వ్యాక్సిన్ల అంశంపై అగ్గిరాజుకుంది. టీకాల గురించి మంత్రి కేటీఆర్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి బీజేపీ నేత రాములమ్మ విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. మళ్లీ అదే అంశంపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. మరోసారి రాములమ్మ రంగ ప్రవేశం చేశారు.
అనవసర విషయమే
వ్యాక్సిన్ల అంశంపై ధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓ అనవసరం విషయంలా అభివర్ణించడం తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ మహిళా నేత విజయశాంతి బదులిచ్చారు. దేశంలో 135 కోట్ల భారీ జనాభా ఉన్నప్పుడు కొవిడ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడడం సహజమే ఒవైసీ జీ... అంటూ ట్వీట్ చేశారు. ప్రపంచం మొత్తం దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని వివరించారు.
సయామీ కవల పార్టీకి తెలియదా..?
ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలనే నీతి సూత్రం మీ సయామీ కవల పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి చెప్పలేదా? అని ప్రశ్నించారు. 2020 జులైలోనే వ్యాక్సిన్ కు ఆమోదం లభిస్తే, ఆ వ్యాక్సిన్ సంస్థకు ఆర్డర్ ఇవ్వకుండా ఏంచేస్తున్నారని విజయశాంతి ప్రశ్నించారు. 25 శాతం ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వడం వీఐపీ సంస్కృతి అయితే, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ సంస్కృతి కోసమా? అని విజయశాంతి ట్విట్టర్ లో విమర్శించారు.
టీకా అంటే తెలుసా చిన్న దొర..
అసలు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా..? అని మంత్రి కేటీఆర్ను విజయశాంతి నిన్న అడిగారు. టీకా ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంతమాత్రమైనా అవగాహన ఉందా..? వ్యాక్సిన్ అనేది గంటలలోనో... రోజులలోనో... ఉత్పత్తి చేసి.. ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారు చేసేది కాదు. అదొ ప్రత్యేకమైన ప్రక్రియ అని ఫైరయ్యారు.
శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి వ్యాక్సిన్ రూపకల్పనకు రేయింబవళ్లు కష్టపడతారని గుర్తుచేశారు. వ్యాక్సిన్ల తయారీ కోసం ఎందరో అవిశ్రాంతంగా పనిచేశారని.. సాధారణంగా టీకాల తయారీకి ఏళ్లు పడుతుందన్నారు. నరేంద్ర మోడీ సర్కారు ప్రోత్సాహం, నిర్దిష్టమైన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడంతో.. మన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశారని వివరించారు. ఫలితంగా రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.